కీసర, వెలుగు: కొత్తగా ఇల్లు కట్టిన ఓ వ్యక్తిని హిజ్రాలు రూ.లక్ష డిమాండ్ చేశారు. ఇవ్వనందుకు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కీసర మండలం చీర్యాల్ శ్రీబాలాజీ ఎన్క్లేవ్ ప్రమిదల సదానందం అనే వ్యక్తి ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. ఆదివారం తన ఇంటి ముందు చిన్న పనులు ఉంటే చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు హిజ్రాలు వచ్చి కొత్త ఇంట్లోకి వచ్చారు కదా, రూ.లక్ష తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అందుకు యజమాని సదానందం నిరాకరించడంతో తిట్టుకుంటూ వెళ్లిపోయారు. తిరిగి మూడు ఆటోల్లో 15 మంది హిజ్రాలు అక్కడికి వచ్చారు. ఇంటి గేటును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. శబ్ధం విని బయటకు వచ్చిన సదానందం, ఆయన కుటుంబ సభ్యులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో హిజ్రాలు పారిపోయారు. ఈ ఘటనపై కీసర పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.
