మరోసారి HMDA ప్లాట్ల వేలం... ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయం

మరోసారి HMDA ప్లాట్ల వేలం...  ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయం
  • ప్రాజెక్టులు, మెట్రో రైల్​టేకోవర్​ ఫండ్స్​ కోసం హెచ్ఎండీఏ ప్లాన్​
  • రూ. 2,500 కోట్లు టార్గెట్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ లో భూముల వేలం ద్వారా భారీ ఎత్తున నిధులను సమకూర్చుకునేందుకు హెచ్ఎండీఏ ప్లాన్స్ రూపొందిస్తోంది. హెచ్ఎండీఏ ప్రాజెక్టులకు భారీగా నిధులు అవసరముండడం, మెట్రో రైల్​టేకోవర్​కోసం ఎల్అండ్​టీకి రూ.2 వేల కోట్లు కట్టాల్సి ఉండడంతో త్వరలోనే ఉప్పల్ భగాయత్, మొకిలా, లేమూరు ప్రాంతాల్లో భూములను వేలం వేయాలని అధికారుల నిర్ణయించారు. 

ఈ నెలాఖరు నాటికి  ప్రక్రియ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. 3 నెలల క్రితం కోకాపేటలో భూముల వేలం ద్వారా 3,862 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్న హెచ్ఎండీఏ మరోసారి మిగిలిన భూముల వేలం వేయడం ద్వారా కనీసం రూ.2,500 కోట్లు రాబట్టాలన్న ఆలోచనతో ఉంది. 

డబ్బులు ఈ ప్రాజెక్టుల కోసమే!

హెచ్ఎండీఏ ఇప్పటికే ప్రతిపాదించిన కొన్ని ప్రాజెక్టులు ముఖ్యంగా రేడియల్​రోడ్స్​–2 ప్రాజెక్ట్​, బుద్వేల్​నుంచి కోకాపేట వరకు నిర్మించనున్న ట్రంపెట్​ఫ్లైఓవర్​, శంకర్​పల్లిలోని ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు 3.57 కి.మీ. పైప్​లైన్​ రోడ్​అభివృద్ధి ప్రాజెక్టు, నానక్​రామ్​గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్​కు ఎడమ వైపున రోడ్డు విస్తరణకు భారీగా నిధులు అవసరమవుతాయని అధికారులు భావిస్తున్నారు. 

వీటితో పాటు బంజారాహిల్స్​నుంచి శిల్పా లేఅవుట్ వరకూ 9 కి.మీ. ఎలివేటెడ్​ కారిడార్, జేబీఎస్ నుంచి శామీర్​పేట వరకు18 కి.మీ. ఎలివేటెడ్​ కారిడార్, ప్యారడైజ్​నుంచి బోయిన్​పల్లి వరకూ నిర్మిస్తున్న ఎలివేటెడ్​కారిడార్​కోసం నిధుల అవసరం ఉంది. ఇవే కాకుండా త్వరలో మెట్రోరైల్​ను ఎల్​అండ్​టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే సమయంలో వారికి చెల్లించాల్సిన రూ. 2వేల కోట్లను కూడా హెచ్​ఎండీఏ ఖజానా నుంచే చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు 
సమాచారం.

ఎక్కడెక్కడ ఎన్ని అంటే? 

గ్రేటర్​ పరిధిలో హెచ్ఎండీఏకు ఉన్న కొన్ని భూముల్లో ఇప్పటికే లేఅవుట్లు వేసి ప్లాట్లు చేశారు. ఇందులో ఉప్పల్​భగాయత్, మోకిల, ఇన్ముల్​నర్వా, లేమూరు, తుర్కయాంజాల్​లేఅవుట్లలో ఇప్పటికే కొన్ని ప్లాట్లను వేలం వేశారు. ఉప్పల్​భగాయత్​లో 41, తుర్కయాంజాల్​లో 12, మోకిలలో 719, లేమూరులో 164, హుడాహైట్స్​లో 37 మిగలగా వాటిని కూడా వేలం వేయబోతున్నారు.