నా భర్త అన్యాయంగా చనిపోయాడు.. కారకులను శిక్షించాలి: హోంగార్డు భార్య

నా భర్త అన్యాయంగా చనిపోయాడు.. కారకులను శిక్షించాలి: హోంగార్డు భార్య

హోంగార్డు రవీందర్ మృతితో ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆయన భార్య సంధ్య ఆందోళన చేపట్టింది. తన భర్త మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేసింది. రవీందర్ ను అన్యాయంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేసిందామె.  

తన భర్త చనిపోయాడనే విషయం చెప్పకుండా దొంగ చాటుగా ఉస్మానియా మార్చురీకి తీసుకొచ్చారని సంధ్య మండిపడింది. చందు, నర్సింగ్ రావులు తన భర్తను బూతులు తిట్టి, అతన్ని వేధించారని ఆగ్రహం వ్యక్త చేసింది. తనను వేధించడమే కాకుండా.. బైక్ లో పెట్రోల్ నింపుతుంటే సిగరెట్ అంటుకుని గాయాలు అయ్యాయని అబద్దం చెప్పారని విమర్శించింది. రవీందర్ మృతిపై ఇప్పటి వరకు ఏ అధికారి స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మరికాసేపట్లో హోంగార్డు రవీందర్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉస్మానియా మార్చరి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రవీందర్ మృతదేహంతో హోంగార్డు అసోసియేషన్ జేఏసీ ఆందోళన బాట పట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రవీందర్ మృతదేహంతో హోంగార్డు జేఏసీ సచివాలయంకు వెళ్లాలని ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 16 వరకు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. దీంతో ఉస్మానియా పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా.. పాతబస్తీ రక్షకాపురానికి చెందిన రవీందర్.. 15 ఏండ్లుగా హోంగార్డుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు.అయితే ప్రభుత్వం హోంగార్డులను రెగ్యులరైజ్ చేయడం లేదని, జీతాలు చెల్లించడం లేదని రవీందర్ ​మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గోషామహల్ కమాండెంట్ ఆఫీసు కు వెళ్లి అడిగాడు. అక్కడి అధికారులు అవమానించడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.