బిగ్ బ్రేకింగ్ : సీఎం కేజ్రీవాల్ ఇంటిపై సీబీఐ విచారణ

బిగ్ బ్రేకింగ్ : సీఎం కేజ్రీవాల్ ఇంటిపై సీబీఐ విచారణ

ఢిల్లీ  సీఎం అరవింద్ కేజ్రీవాల్  అధికారిక నివాసం పునర్నిర్మాణంలో  అవకతవకలకు పాల్పడ్డారనే   ఆరోపణలపై  కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. దీనిపై ఇప్పటికే ప్రాథమిక విచారణను ప్రారంభించామని సీబీఐ అధికారులు బుధవారం వెల్లడించారు.  అధికారిక నివాసం పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్లు, కాంట్రాక్టర్లు సమర్పించిన బిడ్లు,   అక్రమాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ను  అక్టోబర్ 3లోగా అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించామని సీబీఐ  అధికారులు తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ డైరెక్టర్‌కు మే 24న   ఐదు పేజీల లేఖ రాశారు.   దీని ఆధారంగా   సీబీఐ దర్యాప్తుకు హోంశాఖ అనుమతిచ్చింది. 

 అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని తన అధికారిక  నివాసం సుందరీకరణ   కోసం దాదాపు రూ. 45 కోట్లు ఖర్చు చేశారని  బీజేపీ ఆరోపించింది.  ఈ క్రమంలో  ఈ అంశంపై  నివేదిక సమర్పించాలని అక్రమాలకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని  చీఫ్ సెక్రటరీని ఆదేశించారు లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్‌జీ సక్సేనా. అయితే ఇంటి పునర్నిర్మాణంలో  అవకతవకలు జరిగాయని  చీఫ్ సెక్రటరీ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా  దర్యాప్తు చేయాలని మే 24న సీబీఐకి లేఖ రాశారు లెప్టినెంట్ గవర్నర్ సక్సేనా.

కేజ్రీవాల్ నివాసం  ఇంటీరియర్ డెకరేషన్ కు రూ.11.30 కోట్లు, స్టోన్ అండ్ మార్బుల్ ఫ్లోరింగ్ కు రూ.6.02 కోట్లు, ఇంటీరియర్ కన్సల్టెన్సీకి రూ.కోటి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అండ్ అప్లయెన్సెస్ కు రూ.2.58 కోట్లు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కు రూ.2.85 కోట్లు, రూ.1.41 కోట్లు . వార్డ్‌రోబ్ , యాక్సెసరీస్ ఫిట్టింగ్‌పై , వంటగదికి  రూ. 1.1 కోట్లు. అలాగే మంజూరైన రూ.9.99 కోట్లలో ప్రత్యేకంగా రూ.8.11 కోట్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి  ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. 

మరో వైపు ఆప్  సీబీఐ విచారణను తప్పుబట్టింది.  ఆప్ ను అంతమొందించడానికి బీజేపీ తన శక్తినంతా ప్రయోగిస్తుందని ఆరోపించింది. ఇప్పటి వరకు కేజ్రీవాల్ పై 50 కేసులు నమోదు చేశారు కానీ ఏమీ తేల్చలేదని తెలిపింది.