లుసానె: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. స్విట్జర్లాండ్లోని ‘టాప్ ఆఫ్ యూరోప్’గా పిలవబడే జంగ్ఫ్రౌజోచ్లోని ప్రసిద్ధ ఐస్ ప్యాలెస్లో ఫలకంతో సత్కరించారు. చోప్రా సాధించిన అద్భుత విజయాలను అభినందిస్తూ జంగ్ఫ్రౌజోచ్లో ఓ స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని సందర్శించిన చోప్రా.. తన జావెలిన్లో ఒకదాన్ని స్విస్ టూరిజమ్ డిపార్టెమెంట్కు గిఫ్ట్గా ఇచ్చాడు.
దాన్ని స్మారక ఫలకం పక్కనే ఉంచారు. టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెడరర్, గోల్ఫ్ ప్లేయర్ రోరె మెక్ల్రాయ్కు కూడా ఇక్కడ స్మారక ఫలకాలు ఉన్నాయి. దీంతో చోప్రా వాళ్ల సరసన చోటు సంపాదించాడు. జంగ్ఫ్రౌజోచ్లోని ‘వాల్ ఆఫ్ ఫేమ్’ ప్లేయర్ల సాధన, అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తుందని స్విస్ టూరిజమ్ పేర్కొంది. అద్భుతమైన ఐస్ ప్యాలెస్లో తన ఫలకాన్ని ఏర్పాటు చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నానని చోప్రా వెల్లడించాడు.