
రాఖీ పండుగ గురించి పురాణాల్లో కొన్ని కథలున్నాయి. భాగవతం.. భవిష్యపురాణంలో కూడా కొన్ని కీలకఘట్టాలున్నాయని పండితులు చెబుతున్నాయి. మహాభారత యుద్దంలో జరిగిన ఓ సంఘటన నుంచి రాఖీ పండుగ పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ తరువాత దేవుళ్లు కూడా రక్షాబంధనాన్ని జరుపుకున్నారని పండితులు చెబుతున్నారు. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వధించాల్సిన సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తారు. అప్పుడు కృష్ణుడి చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసిన వెంటనే పంచపాండవుల భార్య అయిన ద్రౌపది... తన చీర కొంగును చించి శ్రీకృష్ణుడి వేలుకి రక్షగా చుడుతుంది. అప్పుడు కృష్ణుడు... నీకు ఎటువంటి సమయంలోనైనా ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో కాపాడతాను' అని అభయమిస్తాడు. తర్వాత దుర్యోధనుడి సోదరుడు దుశ్శాసనుడు నిండుసభలో ద్రౌపది చీరను లాగి అవమానించినప్పుడు శ్రీకృష్ణుడు చీరలు అందించి ఆదుకున్నాడు. అలా ద్రౌపది గౌరవమర్యాదలను కాపాడటానికి రాఖీ కారణమైంది. ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని చెప్తారు.
బలి చక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు అతనతోపాటు పాతాళంలో ఉండిపోతాడు. అప్పుడు శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకువస్తుంది. అందుకే రక్షా బంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి.