వామ్మో.. చాయ్, సమోసాకు ఇంత రేటా..!

వామ్మో.. చాయ్, సమోసాకు ఇంత రేటా..!

ఈవెనింగ్ టైంలో ఫ్రెండ్స్ తో అలా బయటికి వెళ్లి.. చల్లని గాలిని ఆస్వాదిస్తూ.. వేడి వేడి చాయ్ తాగుతూ.. మధ్యమధ్యలో వేడి వేడి సమోసా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా.. దీనికి అంత పెద్ద ఖర్చే ఉండదు. మహా అంటే.. సమోసాలకు ఓ 20 రూపాయలు, చాయ్ కి మరో 20 రూపాయలు.. అంటే ఆల్మోస్ట్ 50 రూపాయల్లో అంతా జరిగిపోతుంది. కానీ ఓ వ్యక్తికి మాత్రం అవే రెండు సమోసాలు, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ కలిపి రూ.490 బిల్లైందట. అది ఎక్కడ, ఏంటీ అన్న విషయానికొస్తే.. ఇటీవల తనకు ముంబయి విమానాశ్రయంలో ఎదురైన ఓ వింత అనుభవాన్ని గురించి ఫరా ఖాన్ అనే ఓ జర్నలిస్ట్ ఇలా రాసుకొచ్చారు.

ఎయిర్ పోర్ట్ లో తాను ఒక హాట్ చాయ్, 2 క్రిస్పీ సమోసాలు, ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేశానని ఆమె చెప్పుకొచ్చింది. వీటన్నింటికీ మామూలుగా అయితే రూ.50 నుంచి 100 రూపాయల్లో అయిపోతుంది. కానీ తనకు మాత్రం రూ.490 బిల్లు అయిందని రాసుకొచ్చింది. వీటికి సంబంధించిన ఫొటొలను కూడా ఆమె ట్విట్టర్ లో షేర్ చేసింది. దాంతో పాటు గొప్ప రోజులు వచ్చాయి అనే క్యాప్షన్ ను కూడా ఈ పోస్ట్ కు ఆమె జత చేసింది. ఇది ఎంత రుచికరంగా అనిపించినప్పటికీ, రెండింటి ధర మాత్రం చాలా ఎక్కువ అని పలువురు భావిస్తున్నారు. డిసెంబర్ 28న చేసిన ఈ పోస్ట్ కు ఇప్పటివరకు 1.3 మిలియన్లకు పైగా వ్యూస్ రావడంతో.. ఈ పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు.