- జనవరి-–సెప్టెంబర్లో రూ.29 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు
- గ్లోబల్ ఎకానమీ బాగోలేకపోయినా ఆసక్తి చూపిస్తున్న ఫారిన్ ఇన్వెస్టర్లు
- ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్పై ఫుల్ ఫోకస్
బిజినెస్ డెస్క్, వెలుగు: కరోనా, రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, ఇన్ఫ్లేషన్ వంటి సమస్యల నుంచి గ్లోబల్ ఎకానమీ ఇంకా కోలుకోలేదు. కానీ, దేశ రియల్ ఎస్టేట్ సెక్టార్లోకి మాత్రం భారీగా విదేశీ ఇన్వెస్ట్మెంట్లు వస్తుండడం విశేషం. కొలియర్స్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్లో రియల్ ఎస్టేట్ సెక్టార్లోకి ఏకంగా 3.5 బిలియన్ డాలర్లు (రూ.29 వేల కోట్ల) వచ్చాయి. కిందటేడాది ఇదే టైమ్లో వచ్చిన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లతో పోలిస్తే ఇది 47 శాతం ఎక్కువ.
ఫారిన్ ఇన్వెస్టర్లు, డొమెస్టిక్ ఇన్వెస్టర్లు ( ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) కలిపి ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్లో రియల్ ఎస్టేట్ సెక్టార్లో 4.6 బిలియన్ డాలర్ల (రూ.38 వేల కోట్ల) పెట్టుబడి పెట్టారు. కిందటేడాది ఇదే టైమ్లో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువ. గ్లోబల్ ఎకానమీ బాగోలేనప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టార్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని ఎనలిస్టులు వెల్లడించారు. కిందటేడాది మొత్తంగా వచ్చిన ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లలో (పెద్ద సంస్థలు చేసే పెట్టుబడుల్లో) 93 శాతం ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లోనే వచ్చాయని అన్నారు.
ఆకర్షిస్తున్న ఆఫీస్ సెగ్మెంట్..
రియల్ ఎస్టేట్ సెక్టార్లో కూడా ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్ ఇన్వెస్టర్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ సెగ్మెంట్లోకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు కిందటేడాది మొదటి తొమ్మిది నెలలతో పోలిస్తే ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్లో 1.6 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. 2.9 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. ముఖ్యంగా ఈ సెగ్మెంట్లో పెద్ద డీల్స్ బాగా జరిగాయి. యాపిల్ వంటి కంపెనీలు ఇండియాలో తమ స్టోర్లు పెట్టడం చూశాం.
అలానే చాలా ఎంఎన్సీలు తమ కేపబిలిటీ సెంటర్లను ఇండియాలో ఓపెన్ చేస్తున్నాయి. ఆఫీస్ సెగ్మెంట్ తర్వాత రెసిడెన్షియల్, వేర్హౌసింగ్ సెగ్మెంట్లోకి ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా వచ్చాయి. ఇండస్ట్రియల్ అసెట్స్ (ప్లాంట్ల కోసం ల్యాండ్ తీసుకోవడం) లోనూ ఇన్వెస్టర్లు బాగానే డబ్బులు పెట్టారు.
భవిష్యత్లో మరిన్ని పెట్టుబడులు
బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రస్ట్ అండ్ జీఐసీ ఆఫీస్ అసెట్స్లో భారీగా ఇన్వెస్ట్ చేసింది. సింగపూర్ బేస్డ్ హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ నుంచి ప్రగతి గ్రూప్ 200 మిలియన్ డాలర్లు సేకరించింది. ‘ఇన్ఫ్లేషన్, ఖర్చులు పెరగడం, గ్రోత్ ఆగిపోవడం వంటి సమస్యలతో గ్లోబల్ ఎకానమీ అధ్వాన్నంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ రియల్ ఎస్టేట్ సెక్టార్ స్ట్రాంగ్గా నిలిచింది.
పెరిగిన డీల్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ సెక్టార్లోని వివిధ సెగ్మెంట్లలో ఫారిన్ ఇన్వెస్టర్లు డబ్బులు పెడుతున్నారు. షార్ట్ టెర్మ్లో కొంత వోలటాలిటీ నెలకొన్నప్పటికీ రియల్ ఎస్టేట్ సెక్టార్ మంచి పొజిషన్లో ఉంది’ అని కొలియర్స్ ఇండియా ఎండీ పియూష్ గుప్తా పేర్కొన్నారు. కొలియర్స్ రిపోర్ట్ ప్రకారం, ఫారిన్ ఇన్వెస్టర్లు జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసి మార్కెట్లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు.
స్పీడ్ పెంచిన లోకల్ ఇన్వెస్టర్లు
డొమెస్టిక్ ఇన్వెస్టర్లు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఫోకస్ పెంచారు. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ఈ సెక్టార్లోకి వచ్చిన మొత్తం ఇన్వెస్ట్మెంట్లలో డొమెస్టిక్ ఇన్వెస్టర్ల వాటా 23 శాతానికి పెరిగింది. కిందటేడాది ఈ నెంబర్ 18 శాతంగా ఉంది. వీరు రెసిడెన్షియల్ సెగ్మెంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ సెక్టార్లోకి వచ్చిన మొత్తం ఇన్వెస్ట్మెంట్లలో ఫారినర్ల వాటా 77 శాతంగా అంటే 3.5 బిలియన్ డాలర్లుగా (4.6 బిలియన్ డాలర్లలో) రికార్డయ్యింది.
పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇండియన్ రియల్ ఎస్టేట్ సెక్టార్ నిలుస్తోందని కొలియర్స్ ఇండియా సీనియర్ డైరెక్టర్ విమల్ నాడర్ అన్నారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లు ఈ సెక్టార్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్లలో సగం రెసిడెన్షియల్ సెగ్మెంట్లోకి వచ్చాయని అన్నారు. వడ్డీ రేట్లు నిలకడగా ఉండడంతో ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో ఇండ్ల ప్రాజెక్ట్లలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు.