రంగారెడ్డి మొయినాబాద్ లో చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గరుడ ప్రసాదం కోసం మహిళా భక్తులు పోటెత్తారు. సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లక్ష మందికి పైగా భక్తులకు ప్రసాదం అందజేశారు దేవాలయ సిబ్బంది. అయితే అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేశారు. 20 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు రోడ్డుపైన కార్లు పార్కింగ్ చేసి ఎండలో నిలుచున్నారు.
చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేని దంపతులకు గరుడ ప్రసాదం ఇవ్వనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ ఇటీవల ప్రకటించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం వేకువజామున 5 గంటల నుంచే హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అక్కడికి బయల్దేరారు. కార్లు, ఇతర వాహనాల్లో భారీగా ఆ మార్గంలోకి చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయ 10 గంటలోపే దాదాపుగా 60 వేల మంది భక్తులు అక్కడికి చేరకున్నారు.