జర్నలిస్టులకు ఇండ్లు మంజూరు చేయాలె ..హోంమంత్రికి హెచ్​యూజే వినతి

జర్నలిస్టులకు ఇండ్లు మంజూరు చేయాలె ..హోంమంత్రికి హెచ్​యూజే వినతి

హైదరాబాద్, వెలుగు : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ( హెచ్​యూజే– టీడబ్ల్యూజేఎఫ్​) ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం హోంమంత్రి మహమూద్ అలీని ఆయన నివాసంలో  హెచ్​యూజే ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ప్రభుత్వం స్థానికంగా ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తోందని, హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు లేదా ఇండ్లు మంజూరు చేయాలని హోంమంత్రిని కోరారు.  

జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామనీ సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై స్పందించిన మంత్రి మహమూద్ అలీ ... అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. జర్నలిస్టుల ఇండ్ల కేటాయింపు అంశం సర్కారు దృష్టిలో ఉందని చెప్పారు. హైదరాబాద్​లో జర్నలిస్టు కాలనీ నిర్మించాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నట్లు వివరించారు. దీనిపై మరోసారి సీఎం కేసీఆర్​తో  మాట్లాడతానని మంత్రి పేర్కొన్నారు. హోంమంత్రిని కలిసిన వారిలో హెచ్​యూజే  అధ్యక్షుడు బి.అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ జి.నవీన్, ట్రెజరర్ రాజశేఖర్, ఆఫీస్ బేరర్లు క్రాంతి, లక్ష్మణ్​రావు, ఎస్​.రమేశ్, టీడబ్ల్యూజేఎఫ్​ రాష్ట్ర కార్యదర్శి కొప్పు నిరంజన్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.