- మళ్లీ కట్టిన బ్రిడ్జి కూడా ధ్వంసం
- స్థానికులు అప్రమత్తం కావడంతో తప్పిన పెనుముప్పు
సంబర్ వులూ: ఇండోనేసియాలోని సెమెరు అగ్నిపర్వతం బద్దలు కావడంతో సమీప గ్రామాల్లో వందలాది ఇండ్లు, మసీదులు కాలిపోయాయి. ఇటీవలే మళ్లీ కట్టిన బ్రిడ్జి మరోసారి దెబ్బతిన్నది. లుమజాంగ్ జిల్లాలోని సంబర్ వులూ, సూపితురంగ్ గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా ఈ అగ్ని పర్వతం ఆదివారం పేలిపోయింది. దీంతో ఆకాశంలో 1500 మీటర్ల వరకు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమీప గ్రామాలను పొగ కమ్మేసింది. ముందుగానే అలర్ట్ అయిన స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడంతో పెనుముప్పు తప్పింది. ఆదివారం వాతావరణం అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ను సోమవారం చేపట్టినట్లు అధికారులు వివరించారు.
అగ్ని పర్వతం నుంచి ఎగిసిపడ్డ లావా ఇండ్లను కప్పేసిందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. 3,676 (12 వేల అడుగులు) మీటర్ల ఎత్తులో ఉన్న సెమెరు అగ్నిపర్వతం .. భారీ వర్షాల కారణంగా రాపిడికి గురై పేలిపోయిందని, దీంతో ఆ పర్వతం నుంచి లావా సమీపంలోని నది, గ్రామాల వైపు ప్రవహించిందని చెప్పారు. ముందే అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం జరగలేదని వివరించారు. కాగా, నిరుడు డిసెంబర్ లోనూ ఈ అగ్నిపర్వతం పేలి లావా పొంగి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 51 మంది చనిపోయారు. కొన్ని వందల మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.