
- నాలా కన్వర్షన్ కోసం రూ.2 లక్షలు డిమాండ్
- రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
- రికార్డులు స్వాధీనం, డీటీపై కేసు నమోదు
హుజూరాబాద్, వెలుగు: భూమి నాలా కన్వర్షన్ కోసం లంచం డిమాండ్ చేసిన ఆర్డీవో ఆఫీస్ డీటీ ఏసీబీ వలకు చిక్కాడు. సోమవారం హుజురాబాద్లోని ఆర్డీవో ఆఫీస్లో ఇది చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం… తిమ్మాపూర్ మండలానికి చెందిన ఎడ్ల జోగిరెడ్డితో పాటు మరికొంతమంది రైతులు కేశవపట్నంలో 2.32 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దాని నాలా కన్వర్షన్ కోసం శంకరపట్నం తహసీల్దార్ ఆఫీస్లో ఎడ్ల జోగిరెడ్డి దరఖాస్తు చేసుకోగా ఆర్డీవో ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ ఆయనకు సూచించారు. నవంబర్ 23న ఆర్డీవో ఆఫీస్లో దరఖాస్తు చేసుకున్నాడు. మీ భూమి నాలా కన్వర్షన్ కావాలంటే రూ.2లక్షలు లంచం కావాలని ఆర్డీవో ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్(డీటీ)గా పనిచేస్తున్న సందీప్ డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు ముందుగా రూ. 75 వేలు ఇస్తానని డీటీకి తెలిపాడు. సోమవారం బాధిత రైతు నుంచి డీటీ సందీప్ రూ. 75వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీటీపై కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరచనున్నట్లు తెలిపారు. సంబంధిత రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.రైడ్స్లో సీఐలు వేణుగోపాల్, రాము, సంజీవ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంపై ఆర్డీవో బోయపాటి చెన్నయ్య వివరణ కోరగా సంబంధిత భూమి బాధిత రైతు కాదనీ, నాలా కన్వర్షన్ చేయాలని.. భూమి విలువ పక్కాగా చూపాలంటూ బాధిత రైతు తెలియజేశారని, ఈ విషయంపై హుజూరాబాద్ ఎస్ఆర్వోను సంప్రదించాలని సూచించామన్నారు.