‘ఎస్ సరస్వతి’ స్టోరీ కాంట్రవర్సీ: సాయి మాధవ్ బుర్రా కామెంట్పై.. నటి వ‌ర‌ల‌క్ష్మీ కౌంట‌ర్‌!

‘ఎస్ సరస్వతి’ స్టోరీ కాంట్రవర్సీ: సాయి మాధవ్ బుర్రా కామెంట్పై.. నటి వ‌ర‌ల‌క్ష్మీ కౌంట‌ర్‌!

సినీ ఇండస్ట్రీలో కొత్త వివాదం మొదలైంది. నటి కం డైరెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ మరియు RRR డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మధ్య కథ విషయంలో భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. ఆ వివరాల్లోకి వెళితే..

వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎస్ సరస్వతి’ (S Saraswathi). తన సోదరి పూజా శరత్ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి వరలక్ష్మి నిర్మించింది. నిన్న శుక్రవారం (2026 మార్చి 6న) సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

కథ ఆత్మను చంపేశారు: సాయి మాధవ్ బుర్రా 

‘ఎస్ సరస్వతి’ సినిమా విడుదలైన రోజే మార్చి 6న సాయి మాధవ్ బుర్రా సోషల్ మీడియాలో స్పందిస్తూ, ‘తాను ఇచ్చిన కథను పూర్తిగా మార్చేసి దాని అసలు భావాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. కథను రివెంజ్ డ్రామాగా మార్చి దాని ఆత్మను చంపేశారని’ ఆయన వ్యాఖ్యానించారు. ఆయన నేరుగా సినిమా పేరును చెప్పకపోయినా, అది ‘ఎస్ సరస్వతి’ చిత్రానికే సంబంధించినదని పలువురు భావించారు.

‘‘నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది.. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు.. కథ ని మానభంగం చేశారు.. నాది రివెంజ్ డ్రామా కాదు.. నా సోల్ వేరు.. అసలా కథే వేరు’ అని సాయి మాధవ్ బుర్రా ట్వీట్ చేసాడు.

అయితే, RRR, కల్కి 2898 ఏ.డీ వంటి విజయవంతమైన సినిమాలకు రచయితగా పనిచేసిన ప్యాన్-ఇండియా రైటర్ నుంచి ఇలాంటి వ్యాఖ్య రావడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే, ఆయన నేరుగా సినిమా పేరు చెప్పకపోయినా, అది ‘ఎస్ సరస్వతి’ చిత్రానికే సంబంధించినదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. 

ఈ క్రమంలోనే నటి కం డైరెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ మూవీ సక్సెస్ మీట్లో స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. అస‌లు సాయి మాధవ్ బుర్రా అంత‌గా రియాక్ట్ కావ‌డం వెనుక ఏం జ‌రిగింది? అని వ‌ర‌ల‌క్ష్మీకి మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా వ‌ర‌ల‌క్ష్మీ వివరణ ఇస్తూ సాయి మాధవ్ బుర్రాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ రియాక్షన్ సాయి మాధవ్ బుర్రా సీనియర్ రైటర్ అని, తనకు ఆయనపై గౌరవం ఉందని ఆమె తెలిపారు. కథను అధికారికంగా ఒప్పందం చేసుకుని తీసుకున్నామని, పారితోషికం కూడా చెల్లించామని స్పష్టం చేశారు. అన్నీ ఇచ్చిన త‌రువాత ఆ క‌థ నాదైంది. ఆ క‌థ సాయి మాధ‌వ్ బుర్రగారి వద్ద గ‌త ఆరేళ్లుగా ఉంది. అంత బాగుంటే ఆయ‌నే ఎందుకు చేయ‌లేదు. అంటే అందులో ఏదో ల్యాగ్ ఉందని" వరలక్ష్మి చెప్పుకొచ్చింది. 

కథను అలాగే తీస్తే ప్రసెంట్ జనరేషన్ ఆడియన్స్ స్వీకరించరని భావించి కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని వరలక్ష్మి వివరించారు. సాయి మాధవ్ బుర్రా పంపిన ఆడియో నోట్‌లోని మెయిన్ పాయింట్ ని తీసుకుని తానే స్క్రీన్‌ప్లేను మార్చుకున్నానని చెప్పారు. ముఖ్యంగా సెకండాఫ్ బలహీనంగా ఉందని పలువురు సూచించడంతో కథను మరింత బలంగా ఉండేలా తిరిగి నిర్మించాల్సి వచ్చిందని వెల్లడించారు.

సాధారణంగా ఇలాంటి మార్పులు రచయితతో కలిసి చర్చించి చేస్తామని, అయితే సాయి మాధవ్ బుర్రా పెద్ద సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ అవకాశం రాలేదని వరలక్ష్మి తెలిపారు. అయితే కథలో మార్పులు చేసినప్పటికీ, ఆయనపై గౌరవంతోనే “స్టోరీ” క్రెడిట్‌ను సాయి మాధవ్ బుర్రా పేరు వేశామని ఆమె చెప్పారు. 

అయితే, ఇక్కడ కామెడీ ఏంటంటే.. ప్రస్తుతం సినిమా చూసిన ప్రేక్షకులు కథ బాగుందని సాయి మాధవ్ బుర్రాను ట్యాగ్ చేస్తూ అభినందిస్తున్నారని, ఆ ప్రశంసలు రచయితకు వెళ్లాలా లేదా చిత్ర బృందానికి వెళ్లాలా అన్నది ప్రేక్షకులే నిర్ణయించాల్సిన విషయం అని వరలక్ష్మి వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం సినిమా చూసిన ప్రేక్షకులు కథను ప్రశంసిస్తూ సాయి మాధవ్ బుర్రాను ట్యాగ్ చేయడం జరుగుతోందని, ఆ గౌరవం ఆయనకా లేదా చిత్ర బృందానికా అన్నది ప్రేక్షకులే నిర్ణయించాల్సిన విషయం అని వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఎస్ సరస్వతి’ కథ:

లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) ఒక సింగిల్ మదర్‌. కూతురు సరస్వతి (నివేక్ష) ఆమెకు ప్రపంచం. ఒక రోజు స్కూల్‌కి వెళ్లిన సరస్వతి కనిపించకుండా పోతుంది. తర్వాత స్కూల్‌లోనే అత్యాచారానికి గురై చనిపోయినట్లు తెలుస్తుంది.

అయితే, ఎటువంటి సాక్ష్యాలు లేక పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో, లక్ష్మి న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. లాయర్ రామానుజం (ప్రకాశ్ రాజ్) సహాయం చేసినా కేసు బలహీనమవుతుంది. చివరికి కోర్టు కేసును కొట్టేయాల్సి వస్తుంది.

ఈ క్రమంలోనే, లక్ష్మి ఓ జడ్జిని, ఐఏఎస్‌ అధికారినిని, పోలీస్‌ని హత్య చేస్తుంది. అసలు సరస్వతిపై అత్యాచారం చేసిన నిందితులు ఎవరు? లక్ష్మి ఎందుకు ఆ హత్యలు చేసింది? కేసు విచారణ క్రమంలో.. లాయర్ రామానుజానికి తెలిసిన నిజాలు ఏంటి? ఈ కథలో ప్రియమణి, కిషోర్‌, మురళి శర్మల పాత్ర ఏంటి? చివరకు సరస్వతికి న్యాయం దొరికిందా? అనేది మిగతా కథ.