- సంక్రాంతి ముగియడంతో ఏపీ నుంచి భారీ సంఖ్యలో
- వాహనాలు తిరిగి వచ్చే అవకాశం
- ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా దారి మళ్లింపు చేపట్టిన పోలీసులు
నల్గొండ, వెలుగు : సంక్రాంతి పండుగ ముగియడంతో రిటర్న్ జర్నీలో భాగంగా ఏపీ నుంచి హైదరాబాద్కు భారీ సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉంది. పండుగకు ముందు ఐదు రోజుల్లో 3.20 లక్షల వెహికల్స్ ఏపీ వైపు వెళ్లినట్లు టోల్గేట్ ఆఫీసర్లు ప్రకటించారు. ఇప్పుడు పండుగ సెలవులు ముగియడంతో ఏపీ నుంచి హైదరాబాద్కు ఒకేసారి వాహనాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో పాటు పంతంగి, కొర్లపహాడ్ టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీనిని నివారించేందుకు పోలీసులు విజయవాడ – హైదరాబాద్ హైవేపై వాహనాల దారి మళ్లింపు చేపట్టారు.
హైవేపై డైవర్షన్
గుంటూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి మాల్ మీదుగా మళ్లిస్తున్నారు. మాచర్ల నుంచి వచ్చే వాహనాలను నాగార్జునసాగర్, పెద్దవూర, కొండపల్లేపల్లి, చింతపల్లి-, మాల్ మీదుగా, నల్గొండ నుంచి వచ్చే వాహనాలను మర్రిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్,- చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్కు మళ్లిస్తున్నారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను కోదాడ, -హుజూర్నగర్, -మిర్యాలగూడ, -హాలియా, -చింతపల్లి-, మాల్ మీదుగా మళ్లిస్తున్నారు. హైవేపై చిట్యాల, పెద్దకాపర్తిలో ఫ్లైఓవర్ నిర్మాణాల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడితే వాహనాలను చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్ మళ్లించనున్నారు.
హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నామి నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. డ్రోన్ కెమెరాలు, సీసీ టీవీల ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ వివరించారు.
