బాచుపల్లి, మియాపూర్ లో ఘాటు వాసనలు ..వాయు కాలుష్యంతో జనాలు ఉక్కిరి బిక్కిరి

బాచుపల్లి, మియాపూర్ లో ఘాటు వాసనలు ..వాయు కాలుష్యంతో జనాలు ఉక్కిరి బిక్కిరి
  • ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఎక్కువ
  • కిటికీలు, తలుపులు బంద్​చేసి ఇండ్లలోనే జనం
  • కొందరికి శ్వాస  తీసుకోవడంలో ఇబ్బందులు 
  • తేల్చడానికి మూడు టాస్క్​ఫోర్స్​టీమ్స్​ఏర్పాటు 
  • ఐడీఏ బొల్లారం, ఖాజిపల్లి నుంచే అంటున్న ఆఫీసర్లు 

జీడిమెట్ల, వెలుగు: చలికాలం షురువైందో లేదో నగర శివారులోని పలు ప్రాంతాల్లోని ప్రజలపై పరిశ్రమలు కాలుష్యం పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా బాచుపల్లి, జీడిమెట్ల, మియాపూర్​ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు ఇష్టానుసారం గాలిలోకి కెమికల్స్​వదులుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

వారం, పదిరోజులుగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. దీంతో ఉదయం వాకింగ్​కు వెళ్లేవారు ఇంట్లోంచి బయటకు రావడం లేదు. ఎప్పుడూ తలుపులు, కిటికీలు పెట్టుకునే ఉంటున్నారు. రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపోవడం లేదంటున్నారు. ఘాటు వాసనలతో శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారిందని, కొన్నిసార్లు వాంతులు చేసుకుంటున్నామని వాపోతున్నారు. 

కారణం ఇదే...

సాధారణంగా కెమికల్​కంపెనీల్లో ప్రొడక్షన్​తర్వాత వెలువడే వాయువులను స్కబ్బర్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా శుద్ధి చేసి గాలిలోకి వదలాలి. దీనికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. నిర్వహణకు కూడా ఓపిక కావాలి.  

ఖర్చుపెట్టటం, నిర్వహణ  చేయడం ఇబ్బందిగా పరిణమించడంతో కొన్ని పరిశ్రమలు నేరుగా వాయువులను గాలిలోకి వదులుతూ ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నాయి. ముఖ్యంగా చలికాలంలో కాలుష్య వాయువులు ఆవిరి కాక పలు కాలనీలకు వ్యాపిస్తున్నాయి. దీంతో సమస్య తీవ్రత పెరిగి  వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.  

కాలుష్యం అక్కడ.. బాధితులు ఇక్కడ

ప్రస్తుతం ఐడీఏ బొల్లారం, ఖాజిపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేల్​లోని కొన్ని కంపెనీల నుంచి కాలుష్య వాయువులు వెలువడుతున్నాయని పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు అధికారులు గుర్తించారు. అక్కడి పరిశ్రమలు వదిలిన వాయువులు గాలిలో ఆవిరి కాక బాచుపల్లి, మియాపూర్​ పరిసర ప్రాంతాలను తాకుతున్నాయంటున్నారు. 

దీన్ని తేల్చడానికి మూడు టాస్క్​ఫోర్స్​బృందాలను ఏర్పాటు చేసినట్టు మేడ్చల్​జిల్లా పీసీబీ ఆఫీసర్​రాజేందర్​ తెలిపారు. కాలుష్యవాయువులను వదులుతున్న పరిశ్రమలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవడానికి ఈ బృందాలను పనిచేస్తాయని తెలిపారు.

48 పరిశ్రమల ప్రతినిధులతో మీటింగ్​

పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘాటైన వాసనలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పీసీబీ మంగళవారం 48 పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. హైదరాబాద్​జోనల్​ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో బాచుపల్లి, జీడిమెట్ల, నాచారారం, మల్లాపూర్, చర్లపల్లి, ఉప్పల్​ఇండస్ట్రియల్​ఏరియాలోని కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల గురించి వ్యర్థాల శుద్ధి కేంద్రాలైన టీఎస్​డీఎస్​, జేఈటీఎల్​పరిధిలోకి వచ్చే కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతి కంపెనీ ఘాటైన వాసనలు వెలువడకుండా మెషినరీ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రూల్స్​పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.