
హైదరాబాద్, వెలుగు: ప్యాకేజింగ్ నిపుణుడు, ఎకోబ్లిస్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూపీఓ) గ్లోబల్ అంబాసిడర్ ఎ.వి.పి.ఎస్ చక్రవర్తి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ యూఎన్ఐడీఓ రౌండ్టేబుల్ సమావేశంలో ప్రత్యేక అతిథిగా ప్రసంగించారు. “ఆసియాలో ఆహార ప్యాకేజింగ్ పరిశ్రమలో స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం” అనే అంశంపై డబ్ల్యూపీఓ, వాగెనింగెన్ విశ్వవిద్యాలయం అండ్ రీసెర్చ్ చర్చా కార్యక్రమం నిర్వహించాయి.
ఆసియా ఖండంలోని 15 పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “భారతదేశంలో పంటల కోత అనంతరం 30శాతం వరకు ఆహార నష్టం జరుగుతోంది. దీనికి కారణాలు తగిన ప్యాకేజింగ్ లేకపోవడం, హ్యాండ్లింగ్ లోపాలు, చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం. ప్యాకేజింగ్ను ఖర్చు గా పరిగణించకూడదు. విలువను కాపాడేదానిగా దీనిని చూడాలి. మా దేశ ప్యాకేజింగ్ ఆవిష్కరణలు ప్రపంచం మెప్పు పొందాయి. ఇండియాలో పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్ అభివృద్ధి చెందుతోంది” అని చక్రవర్తి వివరించారు.