
- సైబర్ మోసాలకు బ్యాంక్ అకౌంట్స్ కొనుగోలు
- ఖాతాదారులకు తెలియకుండానే చీటింగ్
- దుబాయి కేంద్రంగా స్టాక్ మార్కెట్ దందా
- మీడియాకు వివరాలు తెలిపిన హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : ఆన్లైన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాలో సీఏని శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి అకౌంట్స్లోని రూ.20 లక్షలు ఫ్రీజ్ చేశారు. రెండు ల్యాప్టాప్స్, 15 డెబిట్ కార్డులు, 5 చెక్ బుక్స్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ‘యూనిటీ స్టాక్స్’ పేరుతో 95 ఫేక్ అకౌంట్లతో దుబాయి కేంద్రంగా ఫ్రాడ్ చేస్తున్నట్టు గుర్తించారు.
అకౌంట్స్ హోల్డర్లకు తెలియకుండానే కమీషన్ పేరిట అమౌంట్ కొట్టేసే ముఠా వివరాలను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శనివారం మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన రోనక్ తన్నా(35)చార్టెడ్ అకౌంటెంట్చదివి.. ప్రస్తుతం సౌత్ గోవాలోని వాస్కోడగామలో ఉంటున్నాడు. దుబాయిలో ఉండే సైబర్ మోసగాళ్లు అర్జున్, యుగ్, నితిన్ తో కలిసి స్టాక్ మార్కెట్ మోసాలకు ప్లాన్ చేశారు. దుబాయి నుంచి యూనిటీ స్టాక్స్పేరుతో స్టాక్ మార్కెటింగ్ నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో లింకులు, మెసేజ్లు షేర్ చేస్తున్నారు. తమ కంపెనీ ద్వారా ట్రేడింగ్ చేస్తే 100 శాతం రిటర్న్స్, ఎక్కువ లాభాలు ఇస్తామని నమ్మిస్తున్నారు.
మొదట్లో నమ్మకం కలిగిస్తూ.. ఆ తర్వాత భారీగా ఇన్వెస్ట్ చేయించి మోసం చేసేవారు. ట్రేడింగ్ డిపాజిట్స్, విత్డ్రాకు ముంబయి, ఢిల్లీలోని పేదల వద్ద బ్యాంక్ అకౌంట్స్ సేకరించి వివరాలను రోనక్ దుబాయికి పంపించేవాడు. ఇలా 100కు పైగా బ్యాంక్ అకౌంట్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేశాడు. ఇందుకు ఒక్కో అకౌంట్కి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు కమీషన్ వసూలు చేసేవాడు. ఆ డబ్బును స్టాక్ మార్కెట్ చీటింగ్స్లో వచ్చే డబ్బులో కొంత మొత్తం అకౌంట్ హోల్డర్స్కి ఇచ్చేవాడు. క్యాష్ విత్డ్రా చేసిన తర్వాత అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ నిలిపి వేసేవారు. ఇలా ముంబయికి చెందిన ఇద్దరు మహిళలు జుడిత్ గొంజాల్వేస్, సనా మహ్మద్ ఖురేషి వద్ద రోనక్ అకౌంట్స్ తీసుకున్నాడు.
అలాగే సికింద్రాబాద్కు చెందిన ఓ యువతికి సోషల్ మీడియా ద్వారా లింక్ పంపించి స్టాక్స్లో పెడితే డబుల్ రిటర్న్స్ ఇస్తామని నమ్మించగా.. కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టింది. ఆమెకు 30శాతం లాభం చూపించారు. ఆమె నుంచి దశల వారీగా రూ. 3.16 కోట్లు వసూలు చేశారు. ఆరు నెలల తర్వాత రిటర్న్స్ ఇస్తామని చెప్పగా.. గడువు ముగిసినా డబ్బు రాలేదు. దీంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఇన్విస్టిగేషన్ లో బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా రోనక్ను అరెస్ట్ చేశారు.
బాధితురాలి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ హోల్డర్స్ జుడిత్ గొంజాల్వేస్ , సనా మహ్మద్ ఖురేషిలకు నోటీసులు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా నమోదైన 83 సైబర్ నేరాల్లో రోనక్ 95 బ్యాంక్ అకౌంట్స్ సేకరించినట్టు గుర్తించారు. ఇలాంటివే రాష్ట్రంలో 14 కేసులు నమోదు అయ్యాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.