
పద్మారావునగర్, వెలుగు: సర్కార్ బడుల్లో ప్రభుత్వం అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తోందని, అక్కడ నాణ్యమైన విద్య అందుతుందని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెప్పారు. సికింద్రాబాద్ మండల పరిధిలోని భోలక్ పూర్ మేకలమండి ప్రైమరీ పాఠశాలను బుధవారం ఆయన విజిట్ చేశారు. కొత్తగా కట్టిన విశాలమైన రూములు, టాయిలెట్స్ బ్లాక్ ను పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, స్టూడెంట్ల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు.
ప్రైవేటు స్కూళ్లకు దీటుగా మేకలమండి పాఠశాల రూపుదిద్దుకున్నదన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి అడ్మిషన్లు పెంచేలా చూడాలన్నారు. అనంతరం ప్రైమరీ స్కూల్ను హైస్కూల్గా అప్గ్రేడ్ చేయాలని కోరుతూ స్కూల్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి రాజు, కోశాధికారి శేషగిరిరావు, కె.మల్లికార్జునరెడ్డి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్, విద్యాశాఖ ఇంజినీరింగ్ విభాగం ఈఈ షఫీ, డీఈ సంజీవ్, ఏఈ వెంకట్, కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి, పాఠశాల హెచ్ఎం స్వరూప, మాజీ హెచ్ఎం మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.