ప్రైవేటుకు దీటుగా మేకలమండి స్కూల్​: హైదరాబాద్​ కలెక్టర్​అనుదీప్​ దురిశెట్టి

ప్రైవేటుకు దీటుగా మేకలమండి స్కూల్​: హైదరాబాద్​ కలెక్టర్​అనుదీప్​ దురిశెట్టి

పద్మారావునగర్, వెలుగు: సర్కార్​ బడుల్లో ప్రభుత్వం అన్ని ఫెసిలిటీస్​ ఏర్పాటు చేస్తోందని, అక్కడ నాణ్యమైన విద్య అందుతుందని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెప్పారు. సికింద్రాబాద్ మండల పరిధిలోని భోలక్ పూర్  మేకలమండి ప్రైమరీ పాఠశాలను బుధవారం ఆయన విజిట్​ చేశారు. కొత్తగా కట్టిన విశాలమైన రూములు, టాయిలెట్స్ బ్లాక్ ను పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, స్టూడెంట్ల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. 

ప్రైవేటు స్కూళ్లకు దీటుగా మేకలమండి పాఠశాల రూపుదిద్దుకున్నదన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి అడ్మిషన్లు పెంచేలా చూడాలన్నారు. అనంతరం ప్రైమరీ స్కూల్​ను హైస్కూల్​గా అప్​గ్రేడ్​ చేయాలని కోరుతూ స్కూల్​ డెవలప్​మెంట్​ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి రాజు, కోశాధికారి శేషగిరిరావు, కె.మల్లికార్జునరెడ్డి కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. 

సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్, విద్యాశాఖ ఇంజినీరింగ్ విభాగం ఈఈ షఫీ, డీఈ సంజీవ్, ఏఈ వెంకట్, కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి, పాఠశాల హెచ్ఎం స్వరూప, మాజీ హెచ్ఎం మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.