ముషీరాబాద్, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం వహించిన చిక్కడపల్లి సీఐ, ఎస్ఐతో పాటు సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ సస్పెండ్ అయ్యారు. చిక్కడపల్లిలో పీఎస్లో సీఐగా పనిచేస్తున్న పాలడగు శివశంకర్ రావు, అశోక్ నగర్ సెక్టార్ ఎస్ఐ నర్సింగ్ రావు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న నాగరాజు గౌడ్ ఈ ముగ్గురు ఓ కేసులో ఫిర్యాదుదారుడితో దురుసుగా ప్రవర్తించారు. దీనిపై విచారణకు ఆదేశించిన సీపీ అంజనీకుమార్.. ఈ ముగ్గురు విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గత వారం చిక్కడపల్లి పీఎస్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులను సీసీఎస్కు వెళ్లాలని.. కేసు నమోదులో తాత్సారం చేసినట్లు తెలిసింది. బాధితులు నేరుగా సీపీని కలిసి గోడు వినిపించడంతో ఆయన విచారణ జరిపినట్లు సమాచారం. బాధితులు చెప్పింది నిజమేనని తేలడంతో సీఐ, ఎస్ఐతో పాటు ఈ కేసుతో సంబంధమున్న సీసీఎస్ ఎస్ఐని కూడా సస్పెండ్ చేసినట్లు తెలిసింది.