- హైదరాబాద్లో 15% తగ్గిన క్రైం రేట్: సీపీ సజ్జనార్
- సైబర్ నేరాలు 8 శాతం తగ్గాయి
- పోక్సో కేసులు 27 % , భార్యలపై భర్తల హింస 6% పెరిగింది
- ఆపరేషన్ కవచ్, డ్రోన్ల వినియోగంలో ముందున్నాం
- ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది
- డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం మరిన్ని
- నార్కోటిక్ టీమ్స్ ఏర్పాటు చేస్తాం
- ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏఐ సిగ్నలింగ్
- వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడి
- 2025 వార్షిక నివేదిక విడుదల
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉందని.. ఈసారి 15శాతం క్రైం రేట్ తగ్గిందని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, విజిబుల్ పోలీసింగ్, నేరగాళ్లపై నిరంతర నిఘా కొనసాగుతున్నదని చెప్పారు. ‘‘గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఓవర్ఆల్ క్రైమ్ 15 శాతం, సైబర్ నేరాలు 8 శాతం తగ్గాయి” అని వెల్లడించారు.
పోక్సో కేసులు 27 శాతం, భార్యలపై భర్తల హింస 6 శాతం పెరిగిందన్నారు. కొన్ని నేరాల సంఖ్య పెరిగినంత మాత్రాన లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందనడం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది నమోదైన నేరాలకు సంబంధించి ‘2025 వార్షిక నివేదిక’ను శనివారం సజ్జనార్ విడుదల చేశారు.
డీసీపీలతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది నేరాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధించామన్నారు. ఆపరేషన్ కవచ్, డ్రోన్ల వినియోగంలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని నార్కోటిక్ టీమ్స్
హైదరాబాద్ సిటీ పోలీసులకు ఇప్పటికే దేశంలో మంచి పేరు ఉందని, రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునే విధంగా పోలీసింగ్ నిర్వహిస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు. ‘‘గ్రౌండ్ లెవల్లో పోలీసింగ్, డ్రోన్లు, టెక్నాలజీ వినియోగంతో క్రైమ్ రేట్ను తగ్గించాం. ఎవరున్నా.. లేకున్నా పోలీసింగ్ పనిచేస్తూనే ఉంటుంది.
సమాజం మారుతున్నట్టు క్రైమ్ కూడా పెరగడం సాధారణం. రాష్ట్రం చాలా పెద్దపెద్ద సమస్యలను చూసింది. నేరాలకు అనేక కారణాలు ఉన్నాయి. సిటీలో రౌడీషీటర్లపై పీడీ యాక్ట్పెడుతున్నాం. నేరాలను నియంత్రించడంతో పాటు సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం” అని పేర్కొన్నారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో జోనల్ వారీగా మరికొన్ని నార్కోటిక్ టీమ్స్ను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.
సిటీ ట్రాఫిక్ ఛాలెంజ్
హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నదని సజ్జనార్ అన్నారు. మనుషుల కంటే వాహనాల సంఖ్య అధికంగా పెరిగిపోయిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యను తగ్గించడంలో వాహనదారులు కూడా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్ పూలింగ్ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించడం ద్వారా కొంతమేర ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని తెలిపారు. సిటీలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం ఏఐ -ఆధారిత సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందిస్తామని ప్రకటించారు. ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపుతామన్నారు. స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసి ఆహార కల్తీపై నిరంతరం నిఘా పెడతామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్
పరిధిలో నేరాల గణాంకాలు
నేరం 2024 2025
హత్యలు 77 69
హత్యాయత్నాలు 214 176
కిడ్నాపులు 324 166
అల్లర్లు 19 07
మోసాలు 5,303 4,536
మహిళలపై జరిగే నేరాలు
2024 2025
భర్తల హింస 813 1,069
వేధింపులు 877 836
అత్యాచారాలు 584 405
కిడ్నాపులు 162 119
వరకట్న హత్యలు 15 13
ఆత్మహత్యాయత్నాలు 15 15
ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు
2024 2025
ట్రాఫిక్ చలాన్లు 52,94,739 73,69,340
డ్రంకన్ డ్రైవ్ 59,572 49,732
లైసెన్స్ సస్పెండ్ 443 195
జైలు శిక్షలు 4,650 3,185
జరిమానాలు
(రూ.కోట్లలో) 12.05 10.46
