హైదరాబాద్ : బీటౌన్ లో తెలుగమ్మాయి బాలీవుడ్ హీరోయిన్లు వచ్చి తెలుగు సినిమాల్లో నటించడం ఎప్పటి నుంచో వస్తున్నదే. అయితే మన తెలుగు అమ్మాయిలు వెళ్లి బాలీవుడ్ లో అవకాశాలు సంపాదించడం మాత్రం కాస్త అరుదుగానే జరుగుతుంది . కానీ అమ్రిన్ ఖురేషీ ఒకేసారి రెండు సినిమాల్లో హీరోయిన్ చాన్స్ కొట్టేసింది . డిస్ట్రిబ్యూటర్ ఎం.ఐ.ఖురేషీ మనవరాలు, ప్రొడ్యూసర్ సాజిద్ ఖురేషీ కూతురే ఈ అమ్రిన్. అందంగా, అట్రాక్టివ్ గా ఉంటుంది . అందుకే నేరుగా బీటౌన్ లో ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది.
రాజ్ తరుణ్ హీరోగా త్రినాథరావ్ నక్కిన తీసిన ‘సినిమా చూపిస్త మావ’ మూవీని ‘బ్యాడ్ బోయ్ ’గా రీమేక్ చేస్తున్నాడు రాజ్ కుమార్ సంతోషి. దీనిలో అమ్రిన్ హీరోయిన్ . వచ్చే యేడు సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాత సాజిద్ ప్లాన్ చేస్తున్నారు. మరోపక్క ‘జులాయి’ మూవీ కూడా బాలీవుడ్ లో రీమేక్ కానుంది . టోనీ డిసౌజా దర్శకుడు. జనవరిలో షూటింగ్ మొదలు కానుంది . ఇందులో కూడా హీరోయిన్ గా చేస్తోంది అమ్రిన్. ఈ రెండు సినిమాల్లోనూ మిథున్ చక్రవర్తి కొడుకు నమషి హీరోగా నటిస్తున్నాడు. శ్రీదేవి, జయప్రదల తరహాలో సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో చక్రం తిప్పినవాళ్లు ఈ మధ్య కాలంలో లేరు. ఆ స్థాయికి వెళ్లడమే తన లక్ష్యం అంటోంది అమ్రిన్.