లండన్ లో హైదరాబాద్ అమ్మాయి హత్య.. చంపింది బ్రెజిల్ యువకుడు

లండన్ లో హైదరాబాద్ అమ్మాయి హత్య.. చంపింది బ్రెజిల్ యువకుడు

ఇంగ్లాండ్ దేశ రాజధాని లండన్ లో ఘోరం. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజిల్ బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 27 ఏళ్ల తేజస్విని హత్యకు గురైంది. తాను నివాసం ఉంటున్న ఫ్లాట్ లోనే ఈ దారుణం జరిగిందని బంధువులు చెబుతున్నారు. ఈ మేరకు 2023, జూన్ 14వ తేదీ ఉదయం లండన్ నుంచి స్నేహితులు ఫోన్ చేసి చెప్పారని వివరించారు. 

తేజస్విని నాలుగేళ్లులో లండన్ లో ఎంఎస్ చదువుతుంది. తన స్నేహితులతో కలిసి షేరింగ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంది. తేజస్విని ఉంటున్న ఎదురు ఫ్లాట్ లో బ్రెజిల్ కు చెందిన యువకుడు ఉంటున్నాడు. వారి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ.. బ్రెజిల్ యువకుడు కత్తితో తేజస్వినితోపాటు మరో అమ్మాయిపై దాడి చేశాడు. ఈ ఘటనలో తేజస్విని స్పాట్ లోనే చనిపోగా.. మరో అమ్మాయి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. విషయం తెలిసిన వెంటనే తేజస్విని తల్లిదండ్రులు షాక్ అయ్యారు. వారిని ఓదార్చటం ఎవరి వల్లా కావటం లేదు. 

తండ్రి శ్రీనివాసులరెడ్డి ఎలక్ట్రీషియన్ పని చేస్తుండగా.. తల్లి ఇంట్లోనే ఉంటుంది. ఆరు నెలల క్రితం తండ్రికి అనారోగ్యంగా ఉండటంతో.. హైదరాబాద్ ఇంటికి వచ్చింది. నెల రోజులు ఉండి.. మళ్లీ లండన్ వెళ్లింది. మరో రెండు నెలల్లో తన ఎంఎస్ కంప్లీట్ అవుతుందని.. మంచి ఉద్యోగం వస్తుందని ఇంట్లో పేరంట్స్ కు చెప్పింది. చదువు పూర్తి అవుతుండటంతో.. ఇంట్లో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. రెండు నెలల్లో ఇండియా వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పిందని.. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది అంటున్నారు బంధువులు. 

లండన్ లోనే ఉంటున్న తేజస్విని కజిన్ ద్వారా సమాచారం తెలిసిందని..తేజస్విని మృతదేహాన్ని ఇండియా తీసుకురావటానికి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు బంధువులు.