హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీలను అడుక్కునేటోళ్లను చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. పేదోళ్లు బాగుపడితే కాంగ్రెసోళ్లకు ఎందుకు ఇష్టం ఉండదని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో పల్లె ప్రగతి–పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క ప్రసంగానికి అడ్డు తగిలిన మంత్రి తలసాని.. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ లీడర్కు గతి లేకుండా పోయిందన్నారు.
భట్టి విక్రమార్కకు తాను దగ్గరుండి డబుల్ బెడ్రూం ఇండ్లను చూపించానని గుర్తుచేశారు. అయినా వాళ్లు అభివృద్ధిని చూస్తలేరని మండిపడ్డారు. హైదరాబాద్లో ఏం జరుగుతుందో ఈ ప్రపంచమంతా చూస్తున్నదన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. ఒక నూతనమైన ఒరవడిలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు, లింక్ రోడ్లును అభివృద్ధి చేశారన్నారు. ఎస్ఆర్డీపీ కింద పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు.
కరెంట్, మంచినీటి విషయంలో హైదరాబాద్ ప్రజలకు ఇబ్బందులు లేవన్నారు. హైదరాబాద్ అమెరికాతో పోటీ పడే స్థాయికి వచ్చిందని, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం హైదరాబాద్ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.