
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై మేయర్ గద్వాల విజయలక్ష్మి బుధవారం కార్పొరేటర్లతో ఫోన్ ఇన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్, లైటింగ్, నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో రోడ్డు రిపేర్లు, నిమజ్జన పాయింట్ల వద్ద సౌకర్యాలపై మేయర్ వివరాలు అడిగారు.
ఊరేగింపు మార్గాల్లో కొన్ని చోట్ల గుంతలు, ప్యాచ్ వర్క్, శానిటేషన్ సమస్యలు, చెట్ల కొమ్మలు తొలగించాలని కొందరు కార్పొరేటర్లు మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకొని నిమజ్జన కార్యక్రమం సాఫీగా జరిగేలా చూడాలని కార్పొరేటర్లను మేయర్ కోరారు. అనంతరం జోనల్ కమిషనర్లతో మేయర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.