
వెలుగు నెట్వర్క్: నగరాన్ని వర్షం వదలడం లేదు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు సిటీలోని పలుచోట్ల నాన్ స్టాప్ వర్షం కురిసింది. వరదలతో హైటెక్ సిటీ ఆగమైంది. మియాపూర్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద రోడ్డుపై భారీ వరద చేరడంతో బాచుపల్లి నుంచి మియాపూర్కు రాకపోకలు స్తంభించాయి. మైహోం మంగళ వద్ద గల రైల్వే అండర్ పాస్ నీటితో నిండిపోవడంతో కొండాపూర్ రోడ్డును క్లోజ్ చేశారు. మియాపూర్ మదీనగూడ ప్రాణం హాస్పిటల్ ఎదురుగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఏర్పడింది. హెచ్సీయూ వద్ద ఓల్డ్ ముంబై హైవే జలమయమైంది. గండిపేట గేట్లు ఎత్తడంతో ఎంజీబీఎస్ ను వరద ముంచెత్తింది. బస్ స్టాండ్ ప్రాంగణం చెరువును తలపించడంతో జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు.
హైడ్రా అధికారులు భారీ మోటార్లతో వరదనీటిని తొలగించారు. విప్రో జంక్షన్ చెరువును తలపించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీలో కాంపౌండ్ వాల్ లోపలి నుంచి వర్షపు నీరు అలుగుపోసినట్లుగా రోడ్డుపైకి వచ్చింది. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ట్రాఫిక్ ఉన్నతాధికారులతో కలిసి వరద ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ బస్ స్టాప్ చెరువులా మారింది. ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జి తెలం గాణ తల్లి ఫ్లైఓవర్ వరకు భారీ ట్రాఫిక్ ఏర్పడింది. మేడిపల్లి నుంచి ఫీర్జాదిగూడ వరకు భారీగా ట్రాఫిక్ ఏర్పడింది.
ఎంజీబీఎస్ను ముంచిన వరద
గండిపేట గేట్లు ఎత్తడంతో ఆ వరద మహాత్మా గాంధీ బస్స్టేషన్(ఎంజీబీఎస్)లోకి వచ్చింది. దీంతో బస్టాండ్ ప్రాంగణం చెరువులా మారింది. ప్రయాణికులు నీటిలో చిక్కుకోగా హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు బయటికి తీసుకొచ్చాయి.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో..
వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. పరిగి బీసీ కాలనీలో ఇండ్లలోకి నీరు చేరింది. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.