హిందువును అధికారంలోకి తేవడమే సెక్యులరిజమా?

హిందువును అధికారంలోకి తేవడమే సెక్యులరిజమా?

ఈ దేశం కేవలం హిందువులదే కాదని, భారతీయులందరిదీ అని ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘‘ఈ దేశం హిందువులది.. కానీ హిందుత్వవాదులది కాదు. దేశంలో 2014 నుంచి అధికారంలో ఉన్న హిందుత్వవాదిని దించేసి మళ్లీ హిందువును అధికారంలోకి తీసుకురావాలి” అని  రాహుల్ గాంధీ రాజస్థాన్ సభలో చేసి వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. హిందుత్వవాదం బలోపేతానికి ఎరువులేసి పెంచినరాహుల్ గాంధీ, కాంగ్రెస్..  ఇప్పుడు మెజారిటీవాదంతో పంట పండించాలని అనుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు హిందువును అధికారంలోకి తీసుకురావడమనేది సెక్యులరిజం అన్న ఎజెండాగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారా.. వహ్‌వా అంటూ ఒవైసీ ట్వీట్ చేశారు. భారత్ కేవలం ఒక్క హిందువులది మాత్రమే కాదని, అన్ని మతాలుకు చెందిన వారు, ఏ మతాన్ని నమ్మని వాళ్లతో పాటు మొత్తం భారతీయులందరిదీ ఈ దేశమ అని  పేర్కొన్నారు.

పొలిటికల్ సెక్యులరిజంతో ఒరిగిందేం లేదు

కాగా, పొలిటికల్ సెక్యులరిజం వల్ల ఎంత మేలు జరిగిందో ముస్లింలు ఆలోచించుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజకీయ పరమైన లౌకికవాదం వల్ల మనకు  రిజర్వేషన్ వచ్చిందా?  మసీదు కూల్చిన  ప్రజాప్రతినిధులకు  శిక్ష పడిందా? అని ప్రశ్నించారు. పొలిటికల్ సెక్యులరిజంతో ముస్లింలకు ఒరిగిందేమీ లేదన్నారు. తాను పొలిటికల్ సెక్యులరిజం కాకుండా రాజ్యాంగపరమైన లౌకికవాదాన్ని  నమ్ముతానని అన్నారు. మహారాష్ట్రలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.