పద్మారావునగర్, వెలుగు : పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్ను బేగంపేట పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. ఆరుగురు సభ్యుల ముఠాలో నలుగురు పెద్దలు, ఒకరు మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. నార్త్ జోన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రష్మి పెరుమాళ్ నిందితుల వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్, పికెట్ ప్రాంతాలకు చెందిన యువకులు తరచూ మద్యం తాగి రాత్రివేళలో దోపిడీలకు పాల్పడేవారు. నవంబర్ 2, 3 తేదీల్లో ఇద్దరిపై దాడి చేసి నగదు, వాచ్, మొబైల్ ఫోన్లు లాక్కున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులు వన్నం రాజేశ్(18), బోయ నరసింహ(18), బూర్వతి కార్తీక్(18), పరశురామ్(20)తోపాటు ఒక మైనర్ ను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.5,500 నగదు, ఆటో, రెండు మొబైల్ ఫోన్లు, కత్తి, నకిల్ డస్టర్ను స్వాధీనం చేసుకున్నారు.
మరో నిందితుడు శివ పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు. ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, ఇన్స్పెక్టర్ పి.సైదులు పర్యవేక్షణలో డీఐ జి.శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం డీఎస్ఐ సచిదానందం, పీసీలు సతీశ్, మహేశ్, అజ్జు, అశోక్, హరీశ్ చాకచక్యంగా వ్యహరించి నిందితులను పట్టుకున్నారు. 24 గంటల్లో కేసును ఛేధించిన పోలీసులను డీసీపీ అభినంధించారు.
