స్టీల్ కంపెనీలో రూ.46 లక్షలు చోరీ

స్టీల్ కంపెనీలో రూ.46 లక్షలు చోరీ
  • నిందితుడు మాజీ ఉద్యోగి
  • 6 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు

పద్మారావునగర్, వెలుగు: ఓ స్టీల్​కంపెనీలో రూ.46 లక్షలు చోరీ అవగా.. నిందితుడైన ఆ కంపెనీ మాజీ ఉద్యోగిని పోలీసులు 6 గంటల్లోనే పట్టుకున్నారు. నార్త్​జోన్​ డీసీపీ రష్మీ పెరుమాళ్ సికింద్రాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బేగంపేట పోలీస్​స్టేషన్​పరిధిలోని పాటిగడ్డలో గిరీష్ జైన్ సన్ స్టీల్ పేరుతో కంపెనీ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఆ కంపనీలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి లాకర్ లోని రూ.46 లక్షలు దొంగిలించాడు. 

మరుసటి రోజు గుర్తించిన ఎండీ గిరీష్ జైన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు సీసీ ఫుటేజీ పరిశీలించి, చోరీ చేసిన వ్యక్తి ఆ కంపెనీ మాజీ ఉద్యోగి గిరిధారి సింగ్(28)గా గుర్తించారు. మధ్యప్రదేశ్ పురేలీ ప్రాంతానికి చెందిన గిరిధారి సింగ్ ఈ కంపెనీలో మూడేళ్లు పని చేశాడు. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో ఎండీ ఆరు నెలల క్రితం పనిలో నుంచి తీసేశాడు. దీంతో కక్ష పెంచుకొని చోరీ చేశాడు. అదే రోజు రాత్రి సికింద్రాబాద్ కు చేరుకొని, ఆదిలాబాద్ మీదుగా స్వస్థలానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. పోలీసులు ఆ బస్సును జీపీఎస్ ద్వారా చేశారు. 

 నిందితుడిని ఆదిలాబాద్ పోలీసుల సహకారంతో మహారాష్ట్ర బార్డర్ లో అరెస్ట్​చేశారు. అతని వద్ద డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీ అశోక్, బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, సీఐ ప్రసాద్ రావు ఉన్నారు.