హైదరాబాద్, వెలుగు : ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న నకిలీ కన్సల్టెన్సీల గుట్టురట్టయిది. ముగ్గురు సభ్యుల గ్యాంగ్తో పాటు ఫేక్ సర్టిఫికెట్స్ కొనుగోలు చేసిన ఏడుగురు స్టూడెంట్స్ ను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. 300 సర్టిఫికెట్స్, 32 రబ్బర్ స్టాంప్స్, 15 సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కౌన్సిల్ చైర్మన్ లింబాద్రితో కలిసి సీపీ సీవీ.ఆనంద్ వివరాలు వెల్లడించారు.
ఫెయిలైన వారికి పాస్ సర్టిఫికెట్స్
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అశిరెడ్డిపల్లికి చెందిన అంచ శ్రీకాంత్ రెడ్డి(26) బీఎస్సీ అగ్రికల్చర్ చదివాడు. 2017లో మలక్పేట్ సలీమ్నగర్లో శ్రీ సాయి ఎడ్యుకేషన్ పేరుతో కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. వివిధ యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ కి అడ్మిషన్స్ ఇప్పించేవాడు. ఈ క్రమంలో ఇంటర్ ఫెయిల్, డిగ్రీ డ్రాప్ ఔట్ స్టూడెంట్స్ తో పరిచయం ఏర్పడింది. ఇతర దేశాల్లో జాబ్స్, స్టడీస్ కోసం వెళ్లే వారికి ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసేందుకు శ్రీకాంత్రెడ్డి ప్లాన్ చేశాడు. మధ్యప్రదేశ్ భూపాల్లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ (ఎస్ఆర్కేయూ)కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్ గుండేల (34)తో కలిసి ఫేక్ సర్టిఫికెట్స్ సప్లయ్ చేసేందుకు స్కెచ్ వేశాడు.ఫేక్ సర్టిఫికెట్స్ నెట్వర్క్ బ్రేక్ చేసేందుకు ఇద్దరు జాయింట్ సీపీలతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేరెంట్స్ పై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.
బీటెక్ పట్టాకు రూ.3లక్షలు
ఎస్ఆర్కేయూలో కేతన్ సింగ్ గుండేల సీఎస్ఈ ప్రొఫెసర్గా పని చేస్తున్నాడు. తమ యూనివర్సిటీ నుంచి ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా సప్లయ్ చేస్తున్నాడు. అడ్మిషన్స్, అటెండెన్స్, ఎగ్జామ్ లేకుండానే కావాల్సిన సర్టిఫికెట్స్ అందిస్తున్నాడు. డిగ్రీని బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నాడు. మీడియేటర్స్ ద్వారా కేతన్ సింగ్తో శ్రీకాంత్ రెడ్డి కాంటాక్ట్ అయ్యాడు. కాలేజ్, స్కూల్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ నంబర్స్ కలెక్ట్ చేశాడు. సర్టిఫికెట్స్ లో ప్రింట్ కావాల్సిన స్టూడెంట్స్ వివరాలను కేతన్ సింగ్కి అందించేవాడు. బీటెక్ సర్టిఫికెట్ కావాలంటే రూ.3 లక్షలు, బీఎస్సీ రూ.1.70 లక్షలు, బీకామ్ డిగ్రీ సర్టిఫికెట్స్ కావాలంటే రూ.1.5లక్షలు రేట్ ఫిక్స్ చేశారు.
కొనుగోలు చేసిన స్టూడెంట్స్ అరెస్ట్
అభ్యర్ధుల నుంచి డబ్బు వసూలు కాగానే సర్టిఫికెట్స్ డైరెక్ట్ గా ఇంటికే డెలివరీ చేసేవారు. ఫేక్ సర్టిఫికెట్స్ సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు టీమ్ కేసును దర్యాప్తు చేసింది. కేతన్ సింగ్తో పాటు శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకుంది. శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఖైరతాబాద్కి చెందిన దుంపల్లి శశాంక్(25), చింతల్కి చెందిన అలుక నిషాంత్ రెడ్డి(26), వనస్థలిపురానికి చెందిన కొడాలి సాయికృష్ణ(23), చిలకలగూడకు చెందిన వెల్టూరి వినయ్కుమార్ రెడ్డి(22), బోయగూడకు చెందిన బద్ధం అనురాగ్ రెడ్డి(23), నిజాంపేట్కి చెందిన సిరిగిరి యోగానంద్ రెడ్డి(22), యాదాద్రి భువనగిరికి చెందిన మహ్మద్ అల్తాషుద్దీన్(24)లను పోలీసులు అరెస్ట్ చేశారు. పేరెంట్స్ పై కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
మెహిదీపట్నం కన్సల్టెన్సీలో ఐదు యూనివర్సిటీలు
సిద్దిపేట్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందింన గుంటి మహేశ్వర్ రావు(45) టెన్త్ కంప్లీట్ చేశాడు. 2010లో కూకట్పల్లి భాగ్యనగర్లో ప్రైడ్ ఎడ్యుకేషన్ అకాడమీ స్టార్ట్ చేశాడు. ప్రైవేట్ కాలేజ్లు, యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ కి అడ్మీషన్స్ ఇప్పించేవాడు. తర్వాత మెహిదీపట్నం పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 21 వద్దకు ఆఫీస్ చేంజ్ చేశాడు. ఈ క్రమంలో కేతన్ సింగ్ గుండేలాతో కాంటాక్ట్ అయ్యాడు. 2015 నుంచి ఫేక్ సర్టిఫికెట్స్ సప్లయ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎస్ఆర్కేయూతో పాటు మధ్యప్రదేశ్లోని స్వామి వివేకానంద, యూపీ షరన్పూర్లోని గ్లోకల్, చెన్నైలోని కామరాజు యూనివర్సిటీల నుంచి ఫేక్ సర్టిఫికెట్స్ సప్లయ్ చేస్తున్నాడు.
స్పెషల్ ఫోకస్ పెట్టినం...
ఫేక్ సర్టిఫికెట్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాము. గ్రేటర్లో మరో 15 కన్సల్టెన్సీలు ఉన్నట్లు గుర్తించాము. ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తున్నారు. ఎస్ఆర్కే యూనివర్సిటీలో హెడ్స్ కూడా ఇందులో ఉన్నారు. 70 శాతం వాటా వాళ్లకే అందుతోంది. పూర్తి ఆధారాలతో వారిని అరెస్ట్ చేస్తాము. ఇలాంటి యూనివర్సిటీలపై యూజీసీకి కంప్లైంట్ చేస్తాము. గుర్తింపు రద్దు చేపిస్తాం.
- సీవీ ఆనంద్, సీపీ, హైదరాబాద్
ఇక నుంచి ఆన్లైన్లో వెరిఫై చేసుకోవచ్చు...
రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్స్ ను గుర్తించడం ఈజీ. ఆన్లైన్లో ఇన్స్టంట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అన్ని డిగ్రీల వివరాలు అప్లోడ్ చేశాము. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల అకాడమిక్ డేటాతో ఎన్ఏడీ లాకర్లో అందుబాటులో ఉంటుంది. పోలీసులతో కలిసి ఫేక్ సర్టిఫికెట్ ముఠాలకు చెక్ పెడతాం.
- లింబాద్రి, చైర్మన్ ఉన్నత విద్యామండలి కౌన్సిల్
