చందానగర్, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో సిటీలో వెహికల్ చెకింగ్ చేస్తున్న పోలీసులు భారీగా డబ్బును పట్టుకుంటున్నారు. సోమవారం హఫీజ్ పేటకు చెందిన నాగరాజు అనే వ్యక్తి పెద్ద ఎత్తున డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న చందానగర్, మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు చందానగర్ మెయిన్రోడ్ లో తనిఖీలు చేపట్టారు. కారులో వెళ్తున్న నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రూ.99 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి అతడు ఎలాంటి పేపర్లను చూపించకపోవడంతో సీజ్ చేసి పీఎస్కు తరలించారు.
రాంగోపాల్ పేటలో హవాలా క్యాష్ స్వాధీనం
ఆదివారం రాత్రి రాంగోపాల్ పేట పీఎస్ పరిధిలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా హవాలా క్యాష్ పట్టుబడింది. శివరాంపల్లిలో ఉండే శివాన్షు రాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నల్లగుట్టకు చెందిన అతడి ఫ్రెండ్ భవేశ్కుమార్ జైన్తో కలిసి శివాన్షు హవాలా ఏజెంట్లతో పరిచయం పెంచుకున్నాడు. వీరిద్దరు కలిసి హవాలా క్యాష్ను వ్యాపారులకు చేరవేస్తున్నారు. ఆదివారం రాత్రి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ వెనకవైపు నుంచి నల్లగుట్ట వైపునకు శివాన్ష్, భవేశ్ రూ.34 లక్షల 50 వేలను జీపులో తరలిస్తుండగా సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారిద్దరితో పాటు జీపు డ్రైవర్ మన్సూర్ను సైతం అదుపులోకి తీసుకున్నారు. నిందితులతో పాటు పట్టుబడ్డ క్యాష్ను, జీపును, 3 సెల్ ఫోన్లను రాంగోపాల్ పేట పోలీసులకు అప్పగించారు.