హైదరాబాద్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. వేలాది గణేష్ విగ్రహాలు ట్యాంక్ బండ్ కు క్యూ కడుతున్నాయి. ఆటాపాటలతో గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. యువతీయువకులు డ్యాన్సులలతో అదరగొడుతున్నారు.నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల భక్తులతో పాటు బందోబస్తుకు వచ్చిన పోలీసులు కూడా వారితో చేతులు కలిపారు. యువతీయువకులతో స్టెప్పులేశారు. మ్యూజిక్ అనుగుణంగా స్టెప్పులేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తయిన తర్వాత ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మర్గ్ దగ్గర అడిషనల్ డిసిపి ఆనంద్ , ఏసీపీలు సంజయ్ , పూర్ణచందర్ రావు కాసేపు డ్యాన్స్ చేసి అలరించారు.ఒక పోలీస్ కానిస్టేబుల్ అయితే డివైడర్పై నిలబడి డీజే పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. పోలీసుల డ్యాన్స్ చూసి అక్కడున్న భక్తులు కూడా వారితో స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. అలాగే చంద్రాయణగుట్టలో గణేశ్ శోభాయాత్ర ముందు లేడీ పోలీసులు యువతులతో కలిసి డ్యాన్స్ చేశారు. నిత్యం భద్రతా చర్యలో నిమగ్నమయ్యే పోలీసులు ఇలా స్టెప్పులు వేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.