
Hyderabad Real Estate: భూమిని నమ్ముకుని నష్టపోయిన వాడు లేడు అనే నానుడి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ప్రపంచంలో కొత్తగా సృష్టించలేని పరిమిత వనరుల్లో భూమి కూడా ఒకటి. అందుకే సొంతి కల ఉన్న చాలా మంది దానికోసం రాత్రింబవళ్లు కష్టపడటంతో పాటు సరైన చోట కొనుగోలు చేస్తే దాని విలువ పెరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధి అవసరాల రీత్యా ప్రజలు ఎక్కువగా నగరాల బాట పడుతుండటంతో అనేక మెట్రో నగరాల్లో రియల్టీ బూమ్ కొనసాగుతోంది.
చాలా మంది ప్రస్తుతం ఉన్న సమయంలో బెంగళూరు, ముంబై, గురుగ్రామ్, దిల్లీ వంటి నగరాల్లో రియల్టీ బూమ్ ఉందని అనుకుంటుంటారు. అయితే ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా మాత్రం దిమ్మతిరిగే వివరాలను బయటపెట్టారు. 2020 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 4 ఏళ్ల కాలంలో టాప్ మెట్రో నగరాలను పరిశీలిస్తే హైదరాబాద్ రియల్టీ పెట్టుబడిదారులకు 80 శాతం రాబడిని తెచ్చిపెట్టినట్లు చెప్పారు. ఈ భారీ వృద్ధి ముందు మిగిలిన నగరాలు చాలా వెనుకపడ్డాయని ఆయన తన లింక్డిన్ ఖాతాలో స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో దేశంలోని ఇతర నగరాల్లో రియల్టీ రిటర్న్స్ ఎలా ఉన్నాయనే వివరాలను సార్థక్ వెల్లడించారు. నగరాల వారీగా రియల్టీ పెట్టుబడులపై వచ్చిన రాబడుల ర్యాంకింగ్స్ పరిశీలిస్తే..
1. హైదరాబాద్ రియల్టీ 80 శాతం రాబడిని అందించింది.
2. రెండవ స్థానంలో ఉన్న నోయిడా 70 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
3. ఇక గురుగ్రామ్ రియల్టీ ఇన్వెస్టర్లకు 60 శాతం రాబడిని అందించింది.
4. దేశ రాజధాని నగరం దిల్లీ నాల్గోస్థానంలో నిలిచి 45 శాతం రాబడిని రియల్టీ ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టింది
5. టెక్ క్యాపిటల్ బెంగళూరు రియల్టీ తన పెట్టుబడిదారులకు 45 శాతం రాబడిని అందించింది
6. ఆర్థిక రాజధాని నగరం ముంబైలోని రియల్టీ పెట్టుబడులు 40 శాతం రిటర్న్స్ అందించాయి.
7. మహారాష్ట్రలోని పూణే రియల్టీ 30 శాతం రాబడితో నిలిచింది.
8. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరం రియల్టీ రాబడి 25 శాతం గా ఉంది
9. కోల్కతా నగరంలో రియల్టీ పెట్టుబడులు ప్రజలకు 25 శాతం వరకు రాబడిని తెచ్చిపెట్టాయి
10. ఇక చివరిగా చెన్నై మెట్రో నగరాల్లో అత్యల్పంగా రియల్టీ పెట్టుబడుల నుంచి రాబడి 20 శాతానికి పరిమితం అయ్యింది
ప్రస్తుతం షిఫ్ట్ చూస్తుంటే ఇప్పటికే పేరొందిన పెద్ద మెట్రో నగరాల నుంచి అభివృద్ధి చెందుతున్న నగరాల వైపు రియల్టీ పెట్టుబడుల ట్రెండ్ కొనసాగటాన్ని సూచిస్తుంది. ప్రముక సంస్థ నైట్ ఫ్రాంక్ 2024 నివేదిక హైదరాబాద్ బలమైన పనితీరును సమర్థిస్తోంది. సగటు వార్షిక వృద్ధి 6% నుంచి 14% వరకు ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించగా.. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లో ఎక్కువ రియల్టీ బూమ్ కొనసాగుతున్నట్లు పేర్కొంది.
పెరుగుతున్న రియల్టీ డిమాంగ్ కి అనుగుణంగా నోయిడా, గురుగ్రామ్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో కొత్త ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతూనే ఉండగా.. చెన్నై , కోల్కతా లాంటి నగరాలు మాత్రం కొంత వెనుకబడినట్లు రియల్టీ రిపోర్టులు కూడా చెబుతున్నాయి. ప్రధానంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరాలు రియల్టీ పెట్టుబడులకు కేంద్రాలుగా మారుతున్నట్లు తెలుస్తోంది.