మెహిదీపట్నం, వెలుగు : ఉన్నత చదువుకు కెనడాకు వెళ్లిన సిటీ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందగా.. టోలిచౌకి ప్రాంతంలో విషాదం నెలకొంది. టోలిచౌకి బాల్ రెడ్డి నగర్ కాలనీకి చెందిన షేక్ ముజఫర్ అహ్మద్ రిటైర్డ్ రైల్వే డ్రైవర్. అతని కొడుకు ముజామిల్ అహ్మద్ (25). గతేడాది ఉన్నత చదువుకు కెనడా వెళ్లి వాటర్లు వర్సిటీ లో మాస్టర్ లో చేరాడు.
మరో ఆరు నెలల్లో తిరిగి వస్తానని ఇటీవలే తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడాడు. కాగా వారం రోజులుగా అహ్మద్ తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా.. శుక్రవారం ఉదయం హాస్పిటల్ కు వెళ్లేందుకు ఫ్రెండ్ సాయం కోరారు.
అనంతరం గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు అహ్మద్ ఫ్రెండ్స్ అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, నానల్ నగర్ కార్పొరేటర్ నసీరుద్దీన్ విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు కెనడా ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు కార్పొరేటర్ తెలిపారు. మృతదేహం సిటీకి రావడానికి వారం పట్టొచ్చని పేర్కొన్నారు.