నేపాల్ వరదల్లో పలువురు తెలుగువారు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్లోని ఎల్బీ నగర్కు చెందిన కందిమళ్ల సుహాసిని రెడ్డి అదృశ్యమయ్యారు. నిన్నటి నుంచి ఆమె కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకుండా పోయారు.
అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న సుహాసిని.. మొదటిసారిగా నేపాల్ ట్రిప్కి వెళ్లారు. ఈ యాత్ర కోసం ఆమె మూడు నెలల క్రితమే టికెట్లు బుక్ చేసుకున్నారు. అమెరికాలో ఉన్న తన స్నేహితురాలితో కలిసి ఆమె ఈ ట్రిప్ను ప్లాన్ చేసుకున్నారు. ఆదివారం ఆమె హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు.
ఈ ఘటనపై సుహాసిని రెడ్డి తండ్రి మహేందర్ రెడ్డి కన్నీటిపర్యూరవుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఢిల్లీ.. అక్కడి నుంచి ఖాట్మండుకు తన ఫ్రెండ్ వచ్చింది. అక్కడి నుంచి ఇద్దరు కలిసి వెళ్లారు. వెళ్ళినప్పటి నుంచి అంతా బాగానే ఉందని చెప్పింది. కానీ, నిన్నటి నుంచి ఫోన్ కలవడం లేదు అని తెలిపారు.
నిన్న ఉదయం ఇమిగ్రేషన్ కి వెళ్తాము.. అక్కడికి వెళ్తే కనెక్టివిటీ ఉండదని కూడా సుహాసిని చివరగా మంగళవారం నాడు చెప్పింది అని తండ్రి అన్నారు. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ కూతురి జాడ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ కూతురిని క్షేమంగా వెతికిపెట్టాలని వారు వేడుకుంటున్నారు.
