ఐదంతస్తుల భవనం నేలమట్టం

ఐదంతస్తుల భవనం నేలమట్టం
  • అమీన్ పూర్​లో పర్మిషన్, మియాపూర్​లో నిర్మాణం
  • ప్రభుత్వ భూమిలో కట్టడంతో కూల్చేసిన హైడ్రా

మియాపూర్/అమీన్​పూర్, వెలుగు: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి మియాపూర్, అమీన్​పూర్​సరిహదులో నిర్మించిన ఐదంతస్తుల బిల్డింగ్​ను హైడ్రా నేలమట్టం చేసింది. భవన నిర్మాణానికి నిర్మాణదారులు నకిలీ ఎల్ఆర్ఎస్  సృష్టించినట్లు తేలింది. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్  సర్వే నంబర్ 337, 338లో హుడా అప్రూవ్డ్  లే అవుట్​లో ప్లాట్ నంబర్ 126లోని 400 గజాల స్థలాన్ని భాను కన్​స్ట్రక్షన్స్  యజమానులు ఎల్లారెడ్డి అండ్  అదర్స్  కొనుగోలు చేశారు. దీనికి ఆనుకొని శేరిలింగంపల్లి మండలం మియాపూర్​లోని సర్వే నంబర్ 101లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో దాదాపు 473 గజాలను భాను కన్​స్ట్రక్షన్స్  ఓనర్లు కలుపుకున్నారు. 

ఈ స్థలానికి ప్లాట్  నంబర్  126సీ, 126 డీ, 226 పార్ట్  పేర్కొంటూ 873 గజాల్లో 5 అంతస్తుల బిల్డింగ్​ నిర్మాణానికి అమీన్​పూర్  మున్సిపాలిటీ నుంచి పర్మిషన్​ తీసుకున్నారు. పర్మిషన్​ కోసం ఫేక్  ఎల్ఆర్ఎస్  సృష్టించారని, డబ్బులుచెల్లించినట్లు పొందుపర్చిన డీడీ కూడా ఫేక్​ అని మున్సిపల్​ అధికారులు గుర్తించారు. దీనిపై ఇప్పటికే అమీన్​పూర్  పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. దీనిపై హెచ్ఎండీఏ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా, నిర్మాణం కొనసాగించడంతో ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, హెచ్ఎండీఏ, మున్సిపల్​ అధికారులతో కలిసి నిర్మాణాన్ని పరిశీలించారు. అక్రమ నిర్మాణంగా నిర్ధారించుకున్న తర్వాత శనివారం భారీ యంత్రాలతో కూల్చివేతలు చేపట్టారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.