హైదరాబాద్ సిటీ, వెలుగు: కూకట్పల్లి ప్రగతినగర్ చెరువులో పూడికను తొలగించిన హైడ్రా ఇప్పుడు చెత్త వేయకుండా రోడ్డు పొడవునా ఫెన్సింగ్ వేసింది. చెరువు మధ్యలో ఉన్న రోడ్డు పొడవునా చికెన్, మాంసం, చేపల విక్రేతలతో పాటు పలు దుకాణ దారులు కూడా వ్యర్థాలను పడేస్తున్నారని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అందులో పేరుకుపోయిన జంతు వ్యర్థాలను తొలగించారు. 145 లారీల వరకు చెత్తను క్లియర్ చేశారు.
వ్యర్థాలను వేస్తున్న దుకాణదారులకు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించి ఖాళీ చేయించారు. చెరువు మధ్యలో ఉన్న రోడ్డు మార్గాన వెళ్తూ చెత్త విసిరేయడానికి అవకాశం లేకుండా 10 మీటర్ల ఎత్తులో హైడ్రా ఫెన్సింగ్ వేశారు. 1.5 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వేసి వ్యర్థాలు చెరువులో పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెరువులో మురుగు నీరు కలవకుండా అభివృద్ధి పనులు త్వరలో హైడ్రా చేపట్టనుంది.
