హైదరాబాద్ జీడిమెట్లలో పార్కును కాపాడిన హైడ్రా.. కంప్లైంట్ అందిన 3 గంటల్లోనే..

హైదరాబాద్ జీడిమెట్లలో పార్కును కాపాడిన హైడ్రా.. కంప్లైంట్ అందిన 3 గంటల్లోనే..

హైదరాబాద్: జీడిమెట్లలో పార్కును కబ్జా కోరల నుంచి హైడ్రా కాపాడింది. ఫిర్యాదు అందిన 3 గంటల్లోనే సమస్యను పరిష్కరించింది. ఆక్రమణల తొలగించి ప్రహరీ నిర్మించడంతో స్థానిక ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయ. పార్కు ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని అధికారులు బోర్డు పెట్టారు. జీడిమెట్లలో ఉన్న రుక్మిణి ఎస్టేట్స్కు చెందిన 12 వందల గజాల పార్కును తప్పుడు పత్రాలతో సగానికి పైగా అక్రమార్కులు కబ్జా చేశారు. 

కబ్జాలు తొలగించాలని శుక్రవారం మధ్యాహ్నం హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్కి ఫోన్ చేసి ఆక్రమణలు తొలగించాలని హైడ్రా కమిషనర్ సూచించారు. దీంతో.. సాయంత్రానికే మున్సిపల్ సిబ్బందితో కలసి ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. వెంటనే పార్కు ప్రహరీ గోడను నిర్మించారు.

హైదరాబాద్‎లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కు పాదం మోపిన సంగతి తెలిసిందే. శుక్రవారం (జూన్ 27) ఐఎస్ సదన్ కృష్ణా నగర్‎లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. కాగా, ఐఎస్ సదన్ కృష్ణా నగర్‎లో నాళాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

నాలా ఆక్రమణతో వర్షాకాలంలో ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి హైడ్రా అధికారులు.. అక్రమిత స్థలానికి పరిశీలించారు. నిజంగానే కొందరు నిబంధనలకు విరుద్ధంగా నాలాలను అక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు నిర్ధారించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.