
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీకి తాగునీరు అందించే గండిపేట(ఉస్మాన్సాగర్) జలాశయంలోకి మురుగు చేరకుండా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఖానాపూర్, నాగులపల్లి నుంచి వచ్చే మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వారా జలాశయంలోకి వెళ్లకుండా అడ్డుకట్టవేసింది. రూ.2 లక్షలు వెచ్చించి నాలాకు కొత్త షట్టర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఉన్న గేట్లు పాడవడంతో మురుగు నీరు నేరుగా జలాశయంలోకి వెళ్తోంది.
హైడ్రా కమిషనర్ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విషయం తెలియడంతో తాజాగా కొత్తవి ఏర్పాటు చేశారు. బుల్కాపూర్ నాలాను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తే చాలా ప్రయోజనాలుంటాయని, హుస్సేన్ సాగర్కు వర్షపు నీటిని తీసుకువచ్చే ఏకైక నాలాగా ఇదేనని స్థానికులు చెప్పడంతో హైడ్రా దృష్టి పెట్టింది.