
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా పోలీస్ స్టేషన్(పీఎస్) ను సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 8న ప్రారంభించనున్నారు. బుద్ధభవన్లోని హైడ్రా ప్రధాన కార్యాలయం పక్కనే కొత్త పీఎస్ను ఏర్పాటు చేశారు. ఇకమీద చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై స్థానికులు, అధికారుల నుంచి వచ్చే ఫిర్యాదులను హైడ్రా పోలీస్ స్టేషన్లలో స్వీకరించి, కేసులు నమోదు చేయనున్నారు. ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన భూకబ్జా కేసులను కూడా ప్రస్తుతం ప్రారంభం కానున్న హైడ్రా పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయనున్నారు. ఇప్పటికే పీఎస్కు సంబంధించిన అధికారులు, సిబ్బందితోపాటు, డీఎస్పీ నియామకం కూడా పూర్తవడంతో కొత్త పీఎస్ అందుబాటులోకి వస్తే హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది.
త్వరలో బతుకమ్మ కుంటకు సీఎం రేవంత్..
బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను మరింత స్పీడప్ చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. కొద్దిరోజుల్లోనే సీఎం రేవంత్రెడ్డి బతుకమ్మ కుంటను సందర్శిస్తారని చెప్పారు. ఆలోపు చెరువు పనులు పూర్తిచేయాలన్నారు. శుక్రవారం బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను రంగనాథ్ పరిశీలించి మాట్లాడారు. రూ. 7 కోట్లతో చెరువును అభివృద్ధి చేస్తున్నామన్నారు. వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి మహిళలు ఇక్కడే బతుకమ్మ ఆడేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.