 
                                    హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, బాలాపూర్ మండలాల్లో 976 గజాల పార్కుతో పాటు 1.28 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా గురువారం కాపాడింది. మైలార్దేవుపల్లి విలేజ్లోని శాస్త్రీపురం కాలనీలో 976 గజాల పార్కు స్థలం చుట్టూ గతంలో మున్సిపల్ అధికారులు ఫెన్సింగ్ వేశారు.
తప్పుడు డాక్యుమెంట్లతో కొందరు పార్కు స్థలాన్ని కబ్జా చేస్తున్నారని అక్కడి నివాసితులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన హైడ్రా అధికారులు ఈ స్థలాన్ని కాపాడడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే బాలాపూర్ మండలం జిల్లేలగూడలో సర్వే నంబరు 76లోని 1.28 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను హైడ్రా గురువారం తొలగించింది. కొంతమంది ఫేక్ పట్టాలు సృష్టించి ఇందులో ప్లాట్లు విక్రయించడంతోపాటు ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందగానే ,ఈ చర్యలు తీసుకుంది. ఈ స్థలాల విలువ రూ. 111 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

 
         
                     
                     
                    