హైదరాబాద్ సిటీ/ జూబ్లీహిల్స్, వెలుగు: వెంగళరావునగర్లో ఆక్రమణకు గురవుతున్న సుమారు రూ.600 కోట్ల విలువైన మూడెకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకుంది.1975లో హౌసింగ్ బోర్డు 45 ఎకరాల భూమిని సేకరించి, 660 ప్లాట్లతో లేఅవుట్ వేసింది.
ఇందులో పార్కులు, ఇతర అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించింది. వెంగళరావునగర్ మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న 5 ఎకరాల ఖాళీ స్థలంలో ఇప్పటికే 2 ఎకరాలు అక్రమ కట్టడాలతో నిండిపోయింది. మిగిలిన 3 ఎకరాలపై కన్నేసిన కొందరు వ్యక్తులు, అది తమ భూమి అంటూ వివాదాలు సృష్టించారు. ఈ భూమి తమదేనని వాదిస్తున్న మూడు గ్రూపులతో హైడ్రా సమావేశం నిర్వహించింది. ఎవరి వద్ద కూడా సరైన పత్రాలు లేవని తేలింది.
ఈ వివాదంపై హైకోర్టు స్టే ఇచ్చి, ఎటువంటి కార్యకలాపాలు సాగించకూడదని ఆదేశించింది. కోర్టు స్టే అమలులో ఉన్నప్పటికీ, నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్కడ కొత్తగా షెడ్లు వేయడం, గుడిసెలు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వేగంగా స్పందించిన హైడ్రా బృందం, మంగళవారం ఆక్రమణలను తొలగించింది. స్వాధీనం చేసుకున్న 3 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, అది ప్రభుత్వ ఆస్తి అని బోర్డులను ఏర్పాటు చేసింది.
