సంక్రాంతి పండగ సందర్భంగా బుధవారం ( జనవరి 14 ) కూకట్ పల్లి నల్లచెరువు దగ్గర కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. పిల్లలతో కలిసి పతంగులు ఎగరేసిన రంగనాథ్ చిన్నారులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
నల్లచెరువు వంటి జలవనరులు ప్రజలకు విశ్రాంతి, వినోదంతో పాటు పర్యావరణ సమతుల్యతకు కీలకమని పేర్కొన్నారు రంగనాథ్. స్థానికులు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్న కైట్ ఫెస్టివల్ సందడిగా, ఉత్సాహంగా సాగింది.
16 ఎకరాల నుంచి 30 ఎకరాలకు నల్లచెరువు..
ఆక్రమణలతో కూకట్పల్లి నల్ల చెరువు 16 ఎకరాల్లో మాత్రమే మిగలగా, రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన సమాచారం సేకరించిన హైడ్రా 30 ఎకరాలకు విస్తరించింది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన16 కమర్షియల్షెడ్లను తొలగించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలను, దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడంతో 4 మీటర్ల లోతు పెరిగింది. చెరువు వద్ద బతుకమ్మ ఆటలకు ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేస్తున్నారు.
బతుకమ్మలను వేయడానికి ప్రత్యేకంగా చిన్న కుంటను అందుబాటులోకి తెస్తున్నారు. చెరువు చుట్టూ 1.5 కిలోమీటర్ల వాకింగ్ పాత్వే నిర్మించారు. దీన్ని రోజూ 600 మంది ఉపయోగిస్తున్నారని, ఆదివారాల్లో చెరువు పరిసరాలు పిక్నిక్ స్పాట్లా మారతాయని అధికారులు అంటున్నారు. చెరువులో ఐల్యాండ్స్ నిర్మించామని, బోటింగ్ సౌకర్యం, కమ్యూనిటీ హాల్స్ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెద్దవాళ్లు సేదతీరేలా గజబో(విశ్రాంతి మందిరం)లు నిర్మిస్తున్నారు. చెరువుకు నలువైపులా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. చెరువు చుట్టూ మెడిసినల్ ప్లాంట్స్ నాటుతున్నారు.
