
ఆక్రమణలను తొలగించి హైదరాబాద్ నగరవాసులకు బతుకమ్మకుంటను అందుబాటులోకి తెచ్చింది హైడ్రా. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. సెప్టెంబర్ 26న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అందుకోసం దాదాపు పనులు పూర్తయ్యాయి.
అయితే ప్రారంభోత్సవానికి కావాల్సిన అలంకరణలు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 26 నాటికి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలంటూ ఆదేశించారు. మంగళవారం (సెప్టెంబర్ 23) బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు రంగనాథ్.
అధికారులతో పాటు కుంటను పరిశీలించారు. బోట్ షికారు చేశారు. బతుకమ్మకుంట అందుబాటులోకి వస్తున్న సందర్భంగా వైభవంగా ప్రారంభోత్స ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
►ALSO READ | ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్యను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
బతుకమ్మకుంటపై మంగళవారం (సెప్టెంబర్ 23) హైకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. బతుకమ్మకుంట ప్రారంభోత్సవాన్ని, అక్కడ నిర్వహిస్తున్న ఉత్సవాలను ఆపాలంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది హైకోర్టు.
అనంతరం మాట్లాడిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. సెప్టెంబర్ 26న బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం యధావిధిగా జరుగుతుందని చెప్పారు. బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను కొనసాగించవచ్చని గతంలో కోర్టు తెలిపింది. దీంతో పనులు పూర్తి చేసిన హైడ్రా.. ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తోంది.
బతుకమ్మ కుంట ప్రైవేట్ ల్యాండ్ అని, ప్రైవేట్ వ్యక్తుల నుంచి తను కొనుగోలు చేశానని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు ఎడ్ల సుధాకర్ రెడ్డి.