3,200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. టీఎన్జీవో కాలనీలో 16 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్

3,200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. టీఎన్జీవో కాలనీలో 16 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం టీఎన్ జీ వో కాలనీలో సుమారు రూ.3,200 కోట్ల విలువైన 16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. టీఎన్ జీవో ఉద్యోగుల కోసం ప్రభుత్వం గతంలో కొంత భూమిని ఇక్కడ కేటాయించింది. 2007లో వేసిన హెచ్ఎండీఏ లే ఔట్ లో 10 ఎకరాల ముసాయికుంటగా అప్పట్లో పేర్కొన్నారు. 

ఆ పక్కనే 4 ఎకరాలు గ్రీన్ బెల్ట్ ఏరియా గా ప్రకటించారు. అలాగే, 2 ఎకరాలు ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ఇలా కేటాయింపులు జరగగా ఈ భూమి ఆక్రమణలకు గురవుతోందని ప్రజావాణిలో  వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా పరిశీలించింది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలతో కలసి క్షేత్ర స్థాయిలో విచారించింది. ఆక్రమణలను నిర్ధారించుకుని మొత్తం 16 ఎకరాల చుట్టూ శుక్రవారం హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.