
ఓయూ, వెలుగు: ప్రభుత్వ విద్యాసంస్థల నుంచే ప్రతిభావంతులైన స్టూడెంట్లు బయటకు వస్తున్నారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఉస్మానియా వర్సిటీలో చదివిన వారిలో ఓ ప్రధానితో సహా ఎంతో మంది సీఎంలు, ప్రజాప్రతినిధులు ఉన్నారన్నారు. మంగళవారం ఆయన ఓయూను విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఓయూలో జరుగుతున్న పరిశోధనలు, విద్యాపరమైన విషయాలపై ఐక్యూఏసీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దత్తాత్రేయకు వివరించారు. ఎన్ఐఆర్ఎఫ్లో ఉస్మానియా వర్సిటీకి ఉత్తమ ర్యాంక్ రావటం సంతోషాన్నిచ్చిందని దత్తాత్రేయ చెప్పారు. ఉస్మానియా వర్సిటీ అభివృద్ధికి నిధుల కేటాయింపు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. దత్తాత్రేయ వెంట వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ఉన్నారు.