
హైదరాబాద్: రైతు రాజ్యం ఎవరిదో తేల్చుకునేందుకు చర్చ పెడదాం రావాలని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం (జూలై 5) తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నా.. జూలై 8వ తేదీ ఉదయం 11గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు.
72 గంటలు సమయం ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రావాలి. రైతులకు ఎవరు ఏం చేశారో చర్చిద్దామన్నారు. అన్నదాతకు సున్నం పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. చంద్రబాబు జల దోపిడికి వంత పాడుతోంది ఎవరో తెలియదా..? చంద్రబాబు అస్సలు కోవర్టు సీఎం రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. ప్రజాపాలన కాదు.. తెలంగాణలో చంద్రబాబు కోవర్టు పాలన సాగుతుందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని అభినందిస్తున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ALSO READ : వరల్డ్ బిర్యానీ డే ఈ ఆదివారం (జూలై 6)నే.. మన హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ చేద్దామా..!
రైతు సమస్యలపై చింతమడలోనైనా, కొండారెడ్డిపల్లెలో అయినా సరే.. రేవంత్ రెడ్డితో చర్చకు రెడీ అని అన్నారు. కేసీఆర్తో చర్చకు రేవంత్ రెడ్డి ముచ్చట పడ్తున్నాడు. కానీ కేసీఆర్తో చర్చించే అంత స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదు. ఆయనకు మేం చాలని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. ఉద్యోగాల కల్పనపై అశోక్ నగర్లో నిరుద్యోగుల మధ్య చర్చకు రావాలని సవాల్ విసిరారు.
స్థానిక సంస్థల్లో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా కాంగ్రెస్ జెడ్పీటీసీ గెలవదని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామంటున్నారు. వందనా.. వాళ్ళ బొందనా. వంద సీట్లు కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది. వంద సీట్లు గెలవాలంటే ముందు ప్రజలు వాళ్లకు ఓట్లు వేయాలని కదా అని అన్నారు.
రేవంత్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ మాత్రమే తెలంగాణలో జోరు మీదుందని విమర్శించారు. రేవంత్కు బేసిన్ తెలియదు.. బెండకాయ తెలియదని ఎద్దేవా చేశారు. ఎరువులు ఇవ్వటం చేతకాని వాడికి కేసీఆర్ తో చర్చ ఎందుకని నిలదీశారు. ఏ రైతు, ఏ ఎద్దును అడిగినా వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆర్ అని చెప్తారన్నారు. వ్యవసాయం మాత్రమే కాదు.. మత్స్య సంపదను సృష్టించిందే కూడా కేసీఆరేనని అన్నారు.