మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఐ నోబడీ’. జులై 10న తెలుగు, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. స్రవంతి మూవీస్, మైత్రీ మూవీస్ సంస్థల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు శనివారం ప్రకటించారు. నిస్సాం బషీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సమీర్ అబ్దుల్ కథ, స్క్రీన్ప్లే అందించాడు. పార్వతి తిరువోతు హీరోయిన్గా నటించగా, హకీమ్ షాజహాన్, అశోకన్ ఇతర పాత్రలు పోషించారు. ముకేష్ ఆర్ మెహతా, సుప్రియా మీనన్, సి.వి.సారథి కలిసి నిర్మించారు. జేక్స్ బిజాయ్ సంగీతం అందించాడు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఉత్కంఠభరితమైన కథ, వేగవంతమైన స్క్రీన్ప్లే, యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుందని మేకర్స్ తెలియజేశారు. ఇదిలా ఉంటే పృథ్వీరాజ్ ప్రస్తుతం రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ‘ వారణాసి’లో విలన్గా నటిస్తున్నాడు.
