రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని మొక్కాను 

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని మొక్కాను 

హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని అమ్మవారికి మొక్కానని బీజేపీ లీడర్ విజయశాంతి తెలిపారు. ఆదివారం పాతబస్తీ బోనాల జాతరలో పాల్గొన్న విజయశాంతి.. గౌలిపుర  మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ తెలంగాణ వస్తే అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తానని మొక్కానని చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే బంగారు బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ సర్కార్ రావాలని అమ్మవారికి బోనాలు సమర్పించానన్నారు. అమ్మవారి ఆశిస్సులతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే.. మళ్లీ బంగారు బోనమెత్తి, అమ్మవారి మొక్కు తీర్చుకుంటానని విజయశాంతి తెలిపారు.

లాల్ దర్వాజా బోనాలు అంటే తనకు ఎంతో సెంటిమెంట్ అన్న విజయశాంతి.. ప్రతి ఏడాది అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలని ఆది పరాశక్తి అయిన అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. జాతరకు వర్షంలో తడుస్తూ బోనాలతో వస్తున్న అక్కాచెల్లెల్లు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ..  అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.