- రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నన్ను వెంటనే నియమించాలె!
- సోనియాకు సచిన్ పైలట్ అల్టిమేటం
- లేకుంటే వచ్చే ఎన్నికల్లో పంజాబ్ తరహా ఓటమి తప్పదని హెచ్చరిక
పార్టీలో దిద్దుబాటు చర్యలపై సోనియా ఫోకస్
న్యూఢిల్లీ : రాజస్థాన్ సీఎంగా వెంటనే తనను నియమించాలని, లేకపోతే రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ తరహా ఓటమి తప్పదని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి ఆ పార్టీ నేత సచిన్ పైలట్ అల్టిమేటం జారీ చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య పోటాపోటీ వార్ కొనసాగింది. చివరి నిమిషంలో పైలట్ వర్గాన్ని శాంతింపజేసిన హైకమాండ్.. గెహ్లాట్నే సీఎంగా ప్రకటించింది. అయితే, వచ్చే ఏడాది ఎన్నికలున్న నేపథ్యంలో సీఎం పదవి కోసం సచిన్ పైలట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వారం కిందట ఆయన.. సోనియా, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. పంజాబ్లో కాంగ్రెస్పార్టీలో అంతర్గత లొల్లుల వల్లే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని.. రాజస్తాన్ లో అలా జరగకూడదంటే సీఎం మార్పు తప్పనిసరి అని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం.
ఏఐసీసీ ఆఫర్కు నో..
ఇటీవలి సమావేశంలో సచిన్ పైలట్కు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవిని సోనియా ఆఫర్ చేయగా.. పైలట్ తిరస్కరించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలే తనకు ముఖ్యమని, రాష్ట్రాన్ని, తన మద్దతుదారులను వదిలి రాలేనని ఆయన తేల్చి చెప్పినట్టు సమాచారం. అయితే 2023 ఎన్నికల వరకు వేచి చూడాలని పైలట్కు సోనియా సూచించారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి.. మే 13 నుంచి 15 వరకు రాజస్తాన్లోని ఉదయ్పూర్లో జరగనున్న ‘చింతన్ శివిర్ (మేధోమథనం)’పై ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.