ఈ ఫొటోని చూస్తే.. నడుస్తున్న ఈ ఇద్దరు మహిళలూ.. వరద భాధితులే అనుకుంటారు. కానీ అందులో ఒకరు జిల్లా కలెక్టర్ అంటే నమ్ముతారా.. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా.. అదే నిజం. ఇటీవల వర్షాలతో అతలాకుతలం అయిన అస్సాంలోని కచార్ జిల్లాలో బొర్ఖొల డెవలప్మెంట్ బ్లాక్లోని ఓ గ్రామంలో పర్యటించిన దృశ్యమిది.
భారీ వర్షాలతో సతమతమవుతూ... వరద విలయంలో చిక్కుకున్న అస్సాంలో.. ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా... మోకాళ్ల లోతు బురదలో నడుచుకుంటూ వెళ్లి.. అక్కడి ప్రాంత ప్రజల ఇబ్బందులను దగ్గరుండి మరీ తెలుసుకుంటున్నారు ఓ ఐఏఎస్ ఆఫీసర్. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఆదేశాలు వేయడమే గానీ, నేరుగా వెళ్లి సహాయం అందించడం అనేది చాలా అరుదు. అదీ అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో.. నిలువ నీడకు దూరమైన వరద ప్రభావిత బాధితులను ఆదుకునేందుకు ముందడుగు వేశారు కీర్తి జల్లి. అస్సాంలోని కచార్ డిప్యూటీ కమిషనర్ (కలెక్టర్ని అసోంలో అలా పిలుస్తారు) గా సేవలందిస్తోన్న ఆమె.. అక్కడి ప్రజలను అక్కున చేర్చుకొని.. సాదా చీరకట్టుతో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్య విశేషమేమిటంటే కీర్తి జల్లి మన తెలుగమ్మాయే. దీంతో ఆమె చేస్తోన్న అవిరామ శ్రమకు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా నీరాజనాలు పలుకుతూ, ప్రశంసలతో ముంచెతత్తున్నారు.
ఆమెకు వృత్తిపై వున్న నిబద్ధత, ప్రజల పట్ల వున్న మమకారానికి అందరూ ఫిదా అవుతున్నారు. సామాన్య ప్రజలే కాదు.. తోటి ఐఏఎస్లు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఫొటోలను అవనీశ్ శరణ్ అన్న అనే ఐఏఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
Keerthi Jalli IAS, Deputy Commissioner Cachar.? pic.twitter.com/n5CsOoAFMu
— Awanish Sharan (@AwanishSharan) May 26, 2022
మరిన్ని వార్తల కోసం...
